ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య: పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం..
మూసాపేట: పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కూకట్పల్లి రాజీవ్గాంధీ నగర్లోని స్వరూప్, కవితల కుమార్తె ప్రియాంక(18) నగరంలోని షేక్పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
ప్రియాంక తండ్రి వ్యాపారం చేస్తుంటారు. తల్లి గృహిణి. ప్రియాంక చదువు కోసం తల్లిదండ్రులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఆ అంచనాలను అందుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ పరిశీలిస్తే తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అవడం తనను బాధించిందని, తన చదువుకు తల్లిదండ్రులు ఏటా రూ.11లక్షలు చేస్తున్నారని లేఖలో ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.