జగన్ కంపెనీల్లో శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టారు..సాక్ష్యాలున్నాయి: హైకోర్టుకు ఈడీ వెల్లడి
Recommended Video
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్విడ్ ప్రోకో కేసులో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ మనీలాండరింగ్కు పాల్పడ్డారని చెప్పేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని తెలంగాణ హైకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) తెలిపింది. తనపై ఈడీ దాఖలు చేసిన కేసును కొట్టివేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ.
పెట్టుబడులు పెట్టిందని ఈడీ
శ్రీనివాసన్ పిటిషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ... జగన్ సంస్థల్లోకి నిబంధనలు ఉల్లంఘిస్తూ రూ.140 కోట్లు మేరా ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టిందని ఈడీ పేర్కొంది. ఈ పెట్టుబడులన్నీ భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ కంపెనీ లిమిటెడ్లో 2007-2008 మధ్య జరిగాయని ఈడీ వివరించింది. అప్పటి ఏపీ ప్రభుత్వం నుంచి ఇండియా సిమెంట్స్కు లబ్ధి చేకూరడంతో ఈ పెట్టుబడులు పెట్టిందని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఉన్నారని ఈడీ పిటిషన్లో గుర్తుచేసింది.
శ్రీనివాసన్ దాఖలు
తనపై ఈడీ వేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్తో పాటు హైదరాబాదు స్పెషల్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడంపై మినహాయింపు ఇవ్వాలనే పిటిషన్ను కూడా శ్రీనివాసన్ దాఖలు చేశారు. శ్రీనివాసన్కు 75 ఏళ్ల వయస్సుందని తను హాజరుకావడం కష్టంగా ఉందని కోర్టు దృష్టికి ఆయన తరపున వాదించిన లాయర్ తీసుకొచ్చారు. కేసును విచారణ చేసిన హైకోర్టు శ్రీనివాసన్ వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వలేదు. కేసును ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.
జగన్ కంపెనీల్లో పెట్టుబడులు
ఇదిలా ఉంటే 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని కంపెనీలకు సంస్థలకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కొన్ని లబ్ధిలు చేకూర్చడంతో ఆ సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే జగన్ను సీబీఐ 27 మే 2012లో అరెస్టు చేసింది. 16 నెలల పాటు జైలులో ఉన్న జగన్కు బెయిల్ లభించింది. అయితే తనపై కేసులు రాజకీయ కక్షసాధింపు కింద నమోదైనవే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.