ఇంకెన్నాళ్లు...? ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు..
ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యం కావడంతో.. అక్కడి లబ్దిదారుల ఓపిక నశించింది. ఇక అధికారులు ఇప్పట్లో తమకు ఇళ్లు ఇవ్వరని నిర్ణయించుకుని.. వాళ్లే స్వయంగా రంగంలోకి దిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి దీపావళి పండుగ పూట గృహ ప్రవేశాలు చేశారు. అధికారుల అనుమతి లేకుండా లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇన్నాళ్లు ఓపిక పట్టినా...
కొండమల్లెపల్లిలో ఇళ్లు లేనివారి కోసం ప్రభుత్వం 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. అయితే నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్నా లబ్దిదారులకు వాటిని కేటాయించట్లేదు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన లబ్దిదారులు... ఇక తమవల్ల కాదంటూ గృహ ప్రవేశాలు చేశారు. అధికారులను నమ్ముకుంటే ఇప్పట్లో ఇళ్లు కేటాయించే అవకాశం లేకపోవడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని లబ్దిదారులు వాపోతున్నట్లు తెలుస్తోంది.మూడు రోజుల క్రితం కొండ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం భీమనపల్లిలోనూ... అక్కడి లబ్దిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహప్రవేశాలు చేశారు. గతంలో సూర్యాపేట జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
త్వరలోనే అన్ని ఇళ్లు పూర్తి...
రాష్ట్రంలో ఇప్పటికే చాలాచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని... మరికొన్ని చోట్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని శుక్రవారం(నవంబర్ 13) మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే వాటిని పూర్తి చేసి పేద,మధ్య తరగతి వర్గాలకు అందజేస్తామన్నారు. హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్,కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మాట్లాడారు.
హైదరాబాద్లో ఇప్పటికే ఇళ్ల పంపిణీ
గత అక్టోబర్ 26న హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో లబ్దిదారులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేసిన సంగతి తెలిసిందే.జియాగూడలో 840 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కట్టెల మండిలో 120, గోడే కా కబర్లో 192 ఇళ్లను మంత్రి కేటీఆర్ అర్హులైన నిరుపేదలకు అందించారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా రూ.40లక్షల నుంచి రూ.50లక్షలు విలువ చేసే ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇస్తోందని ఆ సందర్భంగా కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,75,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ఇళ్ల మార్కెట్ విలువ రూ.70వేల కోట్లు వరకు ఉంటుందన్నారు.