మరొకరితో చనువుగా ఉందని, పెళ్లికి అంగీకరించలేదనే: సీసీ ఫుటేజీలో దారుణ హత్య, సాగర్ ఇలా దొరికాడు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని యూసఫ్ గూడ జవహర్ నగర్లో సోమవారం సాయంత్రం 19 ఏళ్ల యువతి వెంకటలక్ష్మి హత్య జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడైన హోంగార్డు సాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటలక్ష్మి గత రెండు నెలలుగా నగల దుకాణంలో పని చేస్తోంది. పని నిమిత్తం బయటకు వెళ్లిన నగల దుకాణం యజమాని రావడం లేదు. ఇదే అదునుగా మంగళవారం నిందితుడు ఆమె గొంతు కోసి చంపాడు.
పెళ్లికి నిరాకరించడంతోనే సాగర్ ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు సాగర్ హోంగార్డుగా పని చేస్తున్నాడు. అతనిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రేమను పట్టించుకోకపోవడంతోనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. హత్య కేసులో సీసీ ఫుటేజీలు, సెల్ఫోన్ సిగ్నల్స్ అధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. సాగర్కు మరో ఇద్దరు సహకరించినట్లుగా అనుమానిస్తున్నారు.
మూడేళ్ల క్రితం పనిమనిషిగా
వెంకటలక్ష్మి మూడేళ్ల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా చేరారు. అదే ఇంట్లో డ్రైవర్ కమ్ కుక్గా హోంగార్డు సాగర్ పని చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అతను ఆమెను ప్రేమించాడు. కానీ వెంకటలక్ష్మి ఇంట్లో వాళ్లు పెళ్లికి అంగీకరించలేదు. సాగర్ ప్రవర్తన కారణంగా అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ వెంకటలక్ష్మి పని మానేసింది. అనంతరం నగల దుకాణంలో పని వెతుక్కుంది. తన ఫోన్ నెంబర్ కూడా మార్చింది. ఏడాది తర్వాత వెంకటలక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసుకున్న సాగర్, ఆమె ఫోన్ నెంబర్ కూడా సేకరించాడు.
మరో యువకుడితో బైక్పై చూసి అనుమానం
ఓ సమయంలో వెంకటలక్ష్మి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడని తెలుస్తోంది. కొద్ది నెలల రోడ్డుపై వెళ్తున్న వెంకటలక్ష్మిని అడ్డుకొని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆమెపై చేయిచేసుకున్నాడని తెలుస్తోంది. ఆమె పెళ్లికి నిరాకరించింది. మరోవైపు, ఇటీవల వెంకటలక్ష్మి మరో యువకుడితో బైక్పై వెళ్లడం చూసిన సాగర్కు కోపం వచ్చింది. దీంతో అనవసరంగా అనుమానం పెంచుకున్నాడని తెలుస్తోంది. తనను ప్రేమించకపోయినా.. మరొకరితో సన్నిహితంగా ఉన్నాడని అనుమానం వచ్చిన అతను దానిని జీర్ణించుకోలేకపోయాడు.
సీసీ కెమెరాల్లో రికార్డ్
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి పని చేస్తున్న నగల దుకాణంకు వెళ్లి నిలదీశాడు. పెళ్లి చేసుకోమని మరోసారి డిమాండ్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆమె ససేమీరా అనడంతో ఆమె చాతిపై కూర్చొని బ్లేడ్తో గొంతు కోశాడు. ఆమె ప్రాణాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు అతడిని వెనక్కి తోసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత సాగర్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొత్తం తొమ్మిది నిమిషాల్లోనే హత్యను ముగించుకుని బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తేలింది.
తన గది పైకి వెళ్లి దాక్కున్నాడు
వెంకటలక్ష్మిని హత్య చేసిన అనంతరం సాగర్ ఏమీ తెలియనివాడిలా తాను పని చేస్తున్న రిటైర్డ్ అధికారి సుబ్బయ్య ఇంటికెళ్లి, అక్కడి తన గదిలోని ఇంటిపై దాక్కున్నాడు. వెంకటలక్ష్మి హత్య గురించి తెలిసిన రిటైర్డ్ అధికారి ఇంటి పైకి వెళ్లి చూడగా అక్కడ సాగర్ కనిపించాడు. అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతనిని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
అక్కడ పని మానేసిన వెంకటలక్ష్మి
నర్సంపేటకు చెందిన హోంగార్డు సాగర్ను అప్పట్లో వరంగల్ డీఎస్పీగా పనిచేసిన అధికారి రంగనాథ్ తనవద్ద డ్రైవర్గా పెట్టుకున్నారు. అక్కడినుంచి ఖమ్మం బదిలీ కావడంతో రంగనాథ్ తనతో పాటు సాగర్ను అక్కడకు బదిలీ చేయించుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయిన రంగనాథ్... సాగర్ను మధురానగర్లో నివాసం ఉంటున్న తండ్రి సుబ్బయ్య వద్ద నియమించారు. అప్పటి నుంచి సుబ్బయ్య నివాసంలో వంట పని చేయడంతో పాటు కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అక్కడే గదిలో ఉంటున్న సాగర్కు వెంకటలక్ష్మి పరిచయం కావడంతో పాటు ఆమెను పెళ్లి చేసుకుంటానని యజమాని సుబ్బయ్యకు కూడా చెప్పాడు. దాంతో వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను పిలిచి అడిగారు. వారు అంగీకరించలేదు. అప్పటినుంచి వెంకటలక్ష్మిని పని మానేయించారు. కాగా, వెంకటలక్ష్మి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఎర్రగడ్డ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.