కారులో డాక్టర్ శవం: గూగుల్లో వెతికి చెప్పిన అమెరికాలోని కొడుకు, ఆ కాలనీకి ఎందుకు?
హైదరాబాద్: కిమ్స్ ఆసుపత్రి వైద్యుడు రాఘవేందర్ రావు కారును అమెరికాలో ఉన్న ఆయన తనయుడు గూగుల్ ద్వారా వెతికి ఎక్కడుందో గుర్తించి, బంధువులకు సమాచారం ఇవ్వడం ద్వారా ఆచూకీ తెలిసింది.
పార్కు చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో కిమ్స్ ఆసుపత్రి ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ రాఘవేందర్ రావు మృతదేహాం లభించిన విషయం తెలిసిందే.
పేట్ బషీరాబాద్, కాంటర్ పార్కు గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఉండే రాఘవేందర్ రావు (62) ఈ నెల 25న ఉదయం తొమ్మిదిన్నరకు ఆసుపత్రికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరారు. తన బిఎండబ్ల్యూ కారులో బయలుదేరారు.
మధ్యాహ్నం జూనియర్ డాక్టర్ రాఘవేందర్ రావుకు ఫోన్ చేస్తే.. తాను రావడం లేదని చెప్పారు. మరోవైపు రాఘవేందర్ రావు సతీమణి స్వర్ణలత ఆయనకు ఫోన్ చేస్తే తాను ఆసుపత్రిలో ఉన్నానని చెప్పారు. తర్వాత స్వర్ణలత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
దీంతో సాయంత్రం ఆరు గంటలకు ఆమె ఆసుపత్రికి వెళ్లి ఆరా తీయగా.. అసలు ఆయన రాలేదని చెప్పారు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాఘవేందర్ రావు కారులో జిపిఎస్ పరికరం ఉంది. దీంతో అమెరికాలోని ఆయన కుమారుడు శ్రీధర్ గూగుల్ సెర్చ్ ద్వారా కారు ఓల్డ్ బెయినపల్లి ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు. బంధువులకు చెప్పారు. వారు బుధవారం ఉదయం ఐదున్నరకు వెళ్లి ఓల్డ్ బోయినపల్లిలో గాలించారు. ఏడు గంటలకు హర్ధవర్ధన్ కాలనీలో కారు గుర్తించారు.
డ్రైవింగ్ సీటులో రాఘవేందర్ రావు మృతి చెందాడు. కారు తలుపు లాక్ చేయకుండా ఉంది. అందులో రూ.14,500 నగదు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్, పెన్ డ్రైవ్ ఉన్నాయి. రాఘవేందర్ రావుకు మద్యం అలవాటు లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, కారులో మద్యం సీసా ఉంది.
కాగా, రాఘవేందర్ రావు తరుచు హర్షవర్ధన్ కాలనీకి వచ్చే వారని, 25న ఉదయం పదకొండు గంటల నుంచి కారు అక్కడే పార్కు చేసి ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. డాక్టర్ రాఘవేందర్ రావు ఆ కాలనీకి తరుచు ఎందుకు వచ్చేవార అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.