రావణ కాష్టంలా తెలంగాణ రాష్ట్రం..! ఏకం అవుతున్న నిరసన గళాలు..! ఏకాకి అవుతున్న గులాబీ..!!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టమవుతోంది. డ్రైవర్ శ్రీనివాస రెడ్డి మరణంతో ఆర్టీసి సమ్మె ఒక్కసారి ఉదృత రూపం దాల్చింది. కార్మికులు, ఉద్యోగుల వరకే పరిమితమైన సమ్మె వ్మవహారం ప్రజా ఉద్యమానికి దారి తీస్తోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు మద్దత్తు తెలంపడంతో పాటు, వివిధ ప్రజా సంఘాలు ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దత్తు తెలిపాయి. తాజాగా ఓయూ విద్యార్థి జేఏసి కూడా సమ్మెకు మద్దత్తు తెలిపింది. ఆర్టీసి కార్మికుల సమ్మె ప్రజా ఉద్యమంగా మారక ముందే ప్రభుత్వం తీరు మార్చుకోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు.
వైరల్ అవుతున్న శ్రీకాంతా చారి ఫోటో..! ఉదృతమవుతున్న సమ్మె..!!
అంతే కాకుండా శ్రీకాంతాచారి మరణంతో గద్దె నెక్కిన చంద్రశేఖర్ రావు, శ్రీనివాసరెడ్డి మరణంతో అదఃపాతాళానికి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు చక్కర్టు కొడుతున్నాయి. ఆర్టీసి కార్మికుల సమ్మె అంశంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం చూపాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికి కొంత మంది గులాబీ నేతలు ప్రభుత్వ తీరును సమర్ధించడం పట్ల పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆత్మహత్యలు సమస్యను పరిష్కరించవు..! కార్మికులు మెట్టు దిగాలంటున్న కె.కేశవరావు..!!
ఆత్మహత్యలు సమస్యను పరిష్కరించవని, ఎవరూ తొందరపడొద్దని, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను ఉద్దేశించి టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు హైదరాబాద్ లో ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం చూపవని అన్నారు. ఆర్టీసీ యే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని మేనిఫెస్టో లో పేర్కొన లేదన్నారు. "ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే ప్రభుత్వ పాలసీ మార్చుకోవాలని కోరడమే అన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని కేశవ రావు అన్నారు.
ఆర్టీసీ సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు..! మంత్రుల కార్యాలయాల ముట్టడికి శ్రీకారం..!!
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో సాగుతున్న ఆర్టీసీ ఉద్యమానికి ఓయూ విద్యార్థి జేఏసీ తమ మద్దతు ప్రకటించింది. సోమవారం నుంచి నిరసనలకు దిగాలని నిర్ణయించింది. ఈనెల 14న మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రకటించింది. అలాగే 16న ఓయూలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ పేర్కొంది. 19న విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెవెన్యూ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది.
అన్యాయం చేసిన పాలకులను తరిమికొట్టాలి..! మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క..!!
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉద్ధేశించి ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆంధ్రవాళ్లను తరిమికొట్టినట్లే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన స్థానిక పాలకులను తరిమికొట్టాలని పిలుపు ఇచ్చారు. ‘ఆత్మహత్యలు వద్దు.. పోరాటాలే ముద్దు' అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఉద్యమ నాయకుడునని చెప్పుకునే చంద్రశేఖర్ రావుకు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం కనబడడం లేదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ మహిళ కార్మికురాలిపై మొన్న జరిగిన దుశ్యాసన పర్వం చంద్రశేఖర్ రావుకు కనిపించలేదా? అని అన్నారు. కార్మికుల పోరాటాలకు అండగా ఉంటామన్నారు సీతక్క.
ఖమ్మం జిల్లా బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు..! కేసీఆర్ అహంకారం తగ్గాలన్న భట్టి..!!
సోమవారం ఖమ్మం జిల్లాలో తలపెట్టిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతిచ్చినట్టు ఎమ్మెల్యే బట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ కు కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బలిదానాలు బాధాకరం, ఉద్యోగాలకోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను తీసివేస్తాం అనడం అహంకారమేనన్నారు. ప్రజల ఆస్తిని ఎవరికో ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని, ఎంతకైనా పోరాడతామన్నారు. చంద్రశేఖర్ రావు నియంతలగా, ప్రజలు తనకు బానిసలుగా భావిసున్నాడని చంద్రశేఖర్ రావు పై మండిపడ్డారు.
ఆర్టీసీ సమ్మెకు జన సేన మద్దత్తు..! కార్మికుల తరుపున ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..!!
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మెకు జనజేన పార్టీ మద్దత్తు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెవవేర్చాలని సూచించారు. కార్మికులు ఆవేశాలకు లోనై ఆత్వహత్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, నగరంలోని రాణిగంజ్ లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడడం కలచి వేస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించకుడా కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సనసేనాని డిమాండ్ చేసారు.
ఇంత జరుగుతున్న తగ్గని ప్రభుత్వం..! ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై కఠినంగానే వ్యవహరిస్తోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవర్, కండక్టర్, మెకానికల్ సూపర్వైజర్లు, మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బంది, ఐటీ ట్రైనర్ తదితర పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. అనుభవం, అర్హత ఆధారంగా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో తమ సమీపంలోని డిపో మేనేజర్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని తెలిపింది.