సూపర్ స్టార్ కృష్ణ కంపెనీకి లాభాల పంట: అమాంతం పెరిగిన ఈక్విటీ ధర..
తాజా లాభాలతో.. ఒకప్పుడు రూ.10వేలు పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు దాని విలువ రూ.83వేలకు చేరుకుంది.
హైదరాబాద్: ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణకు చెందిన పద్మాలయా టెలీఫిల్మ్స్ ఈక్విటీ ధర అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1.20గా ఉన్న ఆ కంపెనీ ఈక్విటీ ధర ఇప్పుడు 9.96కు చేరి 733శాతం లాభాన్ని గడించింది.
నిజానికి ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంగతి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఈక్విటీ విలువ కూడా పెద్దగా లేదు కాబట్టి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా భారీ లాభాలు వచ్చేసరికి.. ఇప్పుడు అందరి చూపు దీనిపై పడింది. తాజా లాభాలతో.. ఒకప్పుడు రూ.10వేలు పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు దాని విలువ రూ.83వేలకు చేరుకుంది.
కాగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పద్మాలయ టెలి ఫిల్మ్స్ లో.. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలోని ఘట్టమనేని రమేష్ బాబు, దుర్గాంబ, పార్వతి, గల్లా జయదేవ్, కృష్ణా ప్రొడక్షన్స్ తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు.
ఈస్ట్రన్ సిల్క్ ఇండస్ట్రీస్ అనే మరో సంస్థ ఈక్విటీ విలువ కూడా భారీగానే పెరిగింది. ఈ ఏడాది ఆరంభంలో దాని విలువ రూ.2.38ఉండగా, ఇప్పుడది రూ.7.96కు పెరిగి 234శాతం లాభాన్ని అందించింది. . అలాగే సాన్వారియా ఆగ్రో ఈక్విటీ రూ. 2.55 నుంచి రూ. 7.36కు పెరిగి 190 శాతం లాభాలను అందించింది.పారామౌంట్ కమ్యూనికేషన్స్, ఎస్ఏఎల్ స్టీల్, రతన్ ఇండియా ఇన్ ఫ్రా, టెక్ నిర్మాణ్, తజారియా పాలీ పైప్స్ వంటి కంపెనీలు కూడా మంచి లాభాలను గడించాయి.