మంత్రులు కొంటున్నారు, దళారీ పని, సాయన్నతో నష్టంలేదు: ఎర్రబెల్లి తీవ్రవ్యాఖ్య
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పైన, మంత్రుల పైన తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలించాలని ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి అధికారమిస్తే గులాబీ నేతలు దళారీ పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
టిఆర్ఎస్ పార్టీ చాలాకాలంగా కాంగ్రెస్, టిడిపి, బిజెపిలను తమ వైపుకు లాక్కుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన మండిపడ్డారు. మంత్రులు పాలనను వదిలేసి విపక్ష ఎంపీటీసీలను కొనే పనిలో పడ్డారని ఆరోపించారు. ఎంపీటీసీలను ప్రలోభ పెట్టి తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం బలమైన పార్టీ అని, తమ పార్టీని ఎవరూ బలహీనపర్చలేరన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన కార్యకర్తలు మారరని చెప్పారు. వారు టిడిపిలోనే ఉంటారని చెప్పారు. కాగా, గురువారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కారు ఎక్కిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ నేతల భేటీ
కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం గాంధీ భవన్లో భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.వీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల విషయమై చర్చించారు.
భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తాము గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై చర్చించామని చెప్పారు. మరోసారి తాము భేటీ అవుతామన్నారు. ఏ విషయంలో ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.