హరీష్ లేఖ రాసి కూర్చున్నాడు, 'మహా' సీఎం తిరుగుతుంటే కెసిఆర్..: ఎర్రబెల్లి
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాసి కూర్చున్నారని తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలు శుక్రవారం మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ తీరుతోనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసిఆర్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అందుకు మంత్రుల వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. రైతు సమస్యల పైన తెలంగాణ సర్కార్ అశ్రద్ధ వహిస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రైతు సమస్యల నేపథ్యంలో మార్కెట్లలో తిరుగుతోంటే ఇక్కడ సీఎం కెసిఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కేంద్రం వల్లే: జితెందర్ రెడ్డి
కేంద్రం తీరు వల్లే పత్తి రైతులకు అన్యాయం జరుగుతోందని టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. పత్తికి మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఆంక్షలు సరికాదన్నారు.
సీసీఐ సీఎండీతో వ్యక్తిగతంగా మాట్లాడి 12-16 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కోరినట్లు చెప్పారు. పత్తి కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల 50 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు.
ప్రస్తుతం 84 సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నాయి. మరో 16 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే తమను బాధ్యుల్ని చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేంద్రం అన్ని రకాలుగా పత్తి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.