మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు, అందుకే కేసీఆర్ ఇచ్చారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పదవుల విషయంలో తనను మోసం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి
సచివాలయంలోని 251 ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణిలు హాజరయ్యారు.
చంద్రబాబు మంత్రి పదవి విషయంలో మోసం చేశారు
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. తనకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్లకు తాను రుణపడి ఉంటానని చెప్పారు. అడగకుండానే మంత్రి పదవితో పాటు ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించారన్నారు. అప్పట్లో తనకు ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయన్నారు. చంద్రబాబు కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు.
అందుకే మంత్రి పదవి ఇచ్చారు
ఉద్యమంలో తన పాత్ర చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని ఎర్రబెల్లి చెప్పారు. కష్టపడ్డ వారికి ఎప్పటికైనా పదవులు రావడం ఖాయమని చెప్పారు. పదవులు ఇస్తానని తనను చంద్రబాబు మాత్రం మోసం చేశారని ఆరోపించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినా ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదని చెప్పారు. కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి ఆయన మన్ననలు పొందుతానని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన గ్రామీణ అభివృద్ది నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ రూపు రేఖలు మారిపోతాయని, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లవుతున్నా గ్రామాలు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయని, గ్రామ పంచాయతీలను పచ్చగా, అందంగా తీర్చిదిద్దాలన్నారు.