'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా తెరాసలో చేరుతున్నారని చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. తెరాస పార్టీ 16 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాలు వస్తాయన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్కు వరుసగా దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి తెరాస అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై గెలిచారు. ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలు
తెరాస ప్రయత్నాలు
కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో 19 మంది గెలిచారు. వారిలో పద్నాలుగు మంది ఆ పార్టీని వీడి తెరాసలో చేరితే విలీనం జరిగే అవకాశముంటుంది. గతంలో టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ శాసనమండలి పక్షం విషయంలో ఇదే జరిగింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఆరుగురు బయటికి వచ్చారు. శాసనసభాపక్షం విలీనం కావాలంటే మరో 8 మంది సభ్యులు కావాలి. వారిని కూడా సమీకరించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇప్పటి వరకు చేరింది వీరు
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియ (ఇల్లందు), సబితా రెడ్డి (మహేశ్వరం), ఉపేందర్ రెడ్డి (పాలేరు) ఇప్పటికే తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం తెరాసలో చేరనున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు ఖమ్మం జిల్లా వారే.
మరో ఎనిమిది మందితో తెరాస చర్చలు
గత ఎన్నికల్లో తెరాస 88 సీట్లు గెలిచింది. ఆ తర్వాత స్వతంత్రులు పార్టీలో చేరారు. దీంతో తెరాస బలం 91గా ఉంది. ఇప్పుడు ఏడుగురు సభ్యులు కాంగ్రెస్, టీడీపీల నుంచి చేరితే మొత్తం సంఖ్య 98కి చేరుతుంది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 19 నుంచి 13కు తగ్గుతుంది. కాగా, తెరాసతో మరో ఆరు నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఎర్రబెల్లి మాటలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. సబితా ఇంద్రా రెడ్డి వంటి నాయకురాలే పార్టీని వీడటంతో ఎవరు ఉంటారు.. ఎవరు వెళ్తారనే గందరగోళంలో కాంగ్రెస్ ఉంది.