రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్.. గత ఎన్నికల్లో ఆ సవాల్ చేసి మాట తప్పారు : ఎర్రబెల్లి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఒక బ్రోకర్ అని, టీఆర్ఎస్పై ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన రేవంత్.. ఆ తర్వాత మాట తప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్,బీజేపీలకు నిజంగా దమ్ముంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్లకు సవాల్ విసిరారు. సీట్లు గెలవడం కాదు కదా విపక్షాలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేవని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో శనివారం ఎర్రబెల్లి మాట్లాడారు.
కాగా,మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పాలనుకుంటోంది. ఇదిలా ఉంటే, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజున మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్, వరంగల్ అర్బన్, ములుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.