పొన్నాలకు ఎర్రబెల్లి, కిరణ్కుమార్ రెడ్డి పరామర్శ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను సోమవారం పరామర్శించారు. శనివారం సచివాలయం తరలింపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
పాదయాత్రకు అనుమతిలేదనే కారణంగా పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పొన్నాల లక్ష్మయ్య చెయ్యి బెణికింది. దీంతో ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు.. పొన్నాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అనవసర పనులకు సిఎం చంద్రశేఖర్ రావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పొన్నాలను సోమవారం ఉదయం పరామర్శించారు. కాగా, నిమ్స్లో చికిత్స పొందుతున్న పొన్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, పలువురు పార్టీ నేతలు పరామర్శించారు.
కుటుంబపాలన: ఎల్ రమణ
తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మండిపడ్డారు. ఆదివారం ఎల్. రమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారని, నాలుగు కోట్ల ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ఒక పీడగా తయారైందని రమణ ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డా కనీసం వారిని పరామర్శించలేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకే సచివాలయాన్ని, చెస్ట్ ఆస్పత్రిని తరలించేందుకు కేసీఆర్ పూనుకున్నారని రమణ ఆరోపించారు.
దమ్ముంటే ఉప ఎన్నికలు పెట్టు: కెసిఆర్కు సబిత సవాల్
తెలంగాణ సిఎం కెసిఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికలపై కెసిఆర్ సర్కారు నాన్చుడు వైఖరిని ఎండగట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చేందుకు కెసిఆర్ ఆకర్ష్ మంత్రాన్ని జరిపిస్తున్నారని ఆరోపించారు.
దమ్ము, ధైర్యం ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాలని సబిత ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలే కెసిఆర్కు సినిమాలు చూపిస్తారని అన్నారు. ఇతర పార్టీల టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి టిఆర్ఎస్లో చేరిన నేతలతో కెసిఆర్ తక్షణమే రాజీనామా చేయించి, సదరు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.