కవితను కలుసుకున్న ఎర్రబెల్లి, శ్రీనివాస గౌడ్..! రాష్ట్రాభివ్రుద్దే లక్ష్యమన్న కొత్త మంత్రులు
హైదరాబాద్ : ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మంత్రులుగా తొలిసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు క్రుతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఆయన కుంటుంబ సభ్యులకు సైతం తమ విధేయతను చూపిస్తున్నారు కొత్త మంత్రులు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సతీసమేతంగా నిజామాబాద్ ఎంపీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయ కవితను కలిశారు.
బుధవారం ఆయన సతీమణితో పాటు సోదరుడు ప్రదీప్ రావు, వర్దన్నపేట శాసనసభ్యుడు ఆరూరి రమేష్ లను వెంటపెట్టుకుని కవిత నివాసానికి చేరుకుని ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన ఎర్రెబల్లిని ఈ సందర్భంగా అభినందించారు. తనకు సీయం కేసీఆర్ మంచి శాఖ ఇచ్చారని గ్రామీణ వికాసానికి కృషి చేస్తానని ఎర్రబెల్లి అన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు సీయం కేసీఆర్, కవితలకు దయాకరరావు కృత్ఞతలు తెలియజేశారు.
ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులోని ఎంపీ కవిత నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ను ఎంపీ కవిత అభినందించారు. సీఎం కేసిఆర్ క్యాబినెట్ లో పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరింత పేరు ప్రతిష్టలు తెస్తానన్నారు. తనకు క్యాబినెట్ లో చోటు కల్పించిన సీఎం కేసీఆర్ కు, కృషిచేసిన ఎంపీ కవిత కు శ్రీనివాస గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివ్రుద్దే తమ ముందున్న లక్ష్యమని కొత్త మంత్రులు ఈ సందర్బంగా పేర్కొన్నారు.