మందుబాబులతో నిండిపోయిన ఎర్రగడ్డ ఆస్పత్రి, ఒక్కరోజే 198 మంది, 97 మంది పరిస్థితి సీరియస్..
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా నిర్భందం కొనసాగుతోంది. దీంతో వైన్ షాపులు కూడా మూసివేశారు. పెగ్గు వేయనిదే నిద్రపోని మందుబాబులు.. లిక్కర్ లభించకపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో విస్తుపోతున్న కుటుంబసభ్యులు వారిని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 198 మందిని తీసుకొచ్చారని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమాశంకర్ తెలిపారు.
గత పదిహేనురోజుల నుంచి వైన్ షాపులు మూసివేశారు. దీంతో మందుబాబులకు సమాజ్ కావడం లేదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో హైరానా పడుతోన్న కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. కరోనా వైరస్ వల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆస్పత్రి రోగులతో నిండిపోతోంది. మంగళవారం దాదాపు రెండు వందల మంది వరకు రోగులను తీసుకొచ్చారు. వారిలో 101 మందికి వైద్యం అందజేసి పంపించామని సూపరింటెండెంట్ తెలిపారు. మరో 97 మందిని మాత్రం ఆస్ప్రత్రిలో చేర్చుకున్నామని వివరించారు. వారి పరిస్థితి బాగోలేకపోవడంతోనే జాయిన్ చేసుకున్నామని చెప్పారు.
మద్యానికి బానిసైన వారికి ఒక్కసారిగా మందు దొరకకపోవడంతో సమస్య వస్తోందని ఉమాశంకర్ తెలిపారు. చికిత్స తర్వాత చాలామంది కోలుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే దీనిని పూర్తిగా నయం కూడా చేయొచ్చని సూచించారు. మద్యాన్ని మాన్పి వేయిస్తే మంచిదని కుటుంబసభ్యులకు సజెస్ట్ చేస్తున్నారు. మందు దొరకక ఎర్రగడ్డ ఆస్పత్రికి చాలా మందిని తీసుకురావడంతో.. అక్కడ వైద్యం అందించేందుకు డాక్టర్లు సరిపోవడం లేదు.