సౌమ్య మృతిలో ఒకరి కంటే ఎక్కువ!: పోలీసులకు చుక్కలు, ఫేస్బుక్-వాట్సాప్ల పరిశీలన
హైదరాబాద్: సౌమ్య హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఎర్రగడ్డలోని నందన్ నగర్లోని ఓ అపార్టుమెంటులో ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు వారికి చిన్న ఆధారం కూడా లభించలేదని తెలుస్తోంది.
మిస్టరీగా సౌమ్య హత్య కేసు, కక్షతో హత్య!: భర్తతో ఎలాంటి విభేదాల్లేవు
ఈ కేసు పట్ల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం సిటీ అడిషనల్ పోలీస్ కమిషనర్ చౌహాన్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు విషయంపై ఆరా తీశారు. కేసు దర్యాఫ్తు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
గదిలోకి వెళ్లి పరీశీలన
హత్య జరిగిన అపార్టుమెంటులోని గదికి వెళ్లి పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడి ఆచూకి కనిపెట్టాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు. సౌమ్య మృతదేహానికి బన్సీలాల్ పేటలో తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు.
బృందాలుగా విడిపోయి విచారణ
మనవడిని తీసుకొని తమ సొంతూరుకు వెళ్లిపోయారు. మరోవైపు, హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో భర్త నాగభూషణంతో పాటు పలువురిని పోలీసులు విచారించారు. అపార్టుమెంటులోని దాదాపు 25 మంది అనుమానుతులను విచారించారు.
పోలీసులకు చుక్కలు
సౌమ్యకు చెందిన ఫేస్బుక్, వాట్సాప్లను పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టకుండా, పకడ్బంధీగా అగంతకుడు హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందట.
ఒకరికంటే ఎక్కువ నిందితులు
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఒకరి కంటే ఎక్కువగా నిందితులు ఉన్నారని భావిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా, పక్కా ప్లాన్తో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. లైంగిక వేధింపుల కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.