సర్పంచ్ లకు ఎర్రబెల్లి వార్నింగ్ ... మరుగుదొడ్డి లేకుంటే వేటు వేస్తామన్న పంచాయితీరాజ్ శాఖామంత్రి
సుదీర్ఘ నిరీక్షణ తరువాత తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖామాత్యులుగా అవకాశం దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తన మార్క్ పాలన చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ గ్రామాన, ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణం విషయంలో సర్పంచ్ లదే బాధ్యతని ఆయన తేల్చి చెప్పారు. ఇంటింటికి మరుగుదొడ్లు లేకుంటే సంబంధిత గ్రామ సర్పంచ్ దే బాధ్యత అని చెప్పిన మంత్రి దయాకర్ రావు మరో సంచలన నిర్ణయం కూడా ప్రకటించారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు వరంగల్ అర్బన్ జిల్లా పున్నేలులో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పదవి వచ్చిందని మాటతీరు, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రజలు క్షమించరని సర్పంచ్లకు సూచించారు. ఇప్పుడే మరింత బాధ్యతాయుతంగా పని చెయ్యాలని చెప్పారు.
ఇంటింటికీ మరుగుదొడ్డి లేకుంటే ఆ గ్రామ సర్పంచ్ను బాధ్యుడిని చేసి.. సస్పెండ్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. గ్రామాలు అభివృద్ధి పధాన నడవాలంటే సర్పంచ్ లు బాధ్యతాయుతంగా పని చెయ్యాలన్న ఉద్దేశంతోనే పంచాయితీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి సర్పంచ్ లతో పని చేయించాలని నిర్ణయం తీసుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు .