ఈఎస్ఐ స్కామ్..దేవికారాణికి ఏసీబీ షాక్: మరోమారు 1.99 కోట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది . ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి కి మరోమారు షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు .దేవికారాణి ఇప్పటికే రెండు సార్లు అరెస్ట్ అయ్యారు . షెల్ కంపెనీలతో కోట్లు స్వాహా చేసిన కేసులో సెప్టెంబర్ లో రెండో సారి ఆమె అరెస్ట్ అయ్యారు. ఏసీబీ అధికారులు ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈఎస్ఐ స్కామ్ లో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు తాజాగా దేవికారాణికి చెందిన మరో 1.99 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.
వివిధ రాష్ట్రాలలో దేవికారాణి పెట్టుబడులు .. ఈ సారి చిట్ ఫండ్స్ పై ఏసీబీ నజర్
ఇప్పటికే పలు సెక్షన్ల క్రింద దేవికా రాణి మీద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తెలంగాణ ,తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో దేవికారాణి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. తాజాగా తెలంగాణ తమిళనాడులోని ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీలు దేవికారాణి కుటుంబ సభ్యుల పేర్ల మీద చిట్టీల రూపంలో డబ్బు దాచుకున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు చిట్ ఫండ్ కంపెనీ నుండి డిడి ల రూపంలో 1.99 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రతీ నెల లక్షల్లో వివిధ చిట్ ఫండ్ కంపెనీలకు చిట్టీలు కడుతున్నట్టు గుర్తించారు .
చిట్ ఫండ్స్ నుండి దాదాపు రెండు కోట్ల రూపాయలను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు
ఆయా చిట్ ఫండ్ కంపెనీలలో అధికారులు సోదాలు జరిపినప్పుడు దేవికారాణి కి సంబంధించిన డిపాజిట్లు గుర్తించారు. దాదాపు రెండు కోట్ల రూపాయలను అధికారులు తాజాగా సీజ్ చేశారు. ఇప్పటికే దేవికారాణి గతంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులను గుర్తించి స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు, అంతకుముందు దేవికారాణి షెల్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. అంతేకాదు నకిలీ సంస్థల పేరుమీద మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
దేవికా రాణిపై కేసుల మీద కేసులు .. ఆమె ఆస్తులు, నగదు సీజ్ చేస్తూ ఏసీబీ వరుస షాకులు
మొదటి నుండి ఈఎస్ఐ స్కాం లో భారీ అవినీతికి పాల్పడిన దేవికారాణి వ్యవహారశైలిపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు, ఇంతకుముందు ఆమె ఒక కమర్షియల్ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన క్రమంలో నాలుగు కోట్లకు పైగా డబ్బును బిల్డర్ నుండి స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాదు షెల్ కంపెనీల వ్యవహారంలో దేవికారాణిని మరోమారు అరెస్ట్ చేశారు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈఎస్ఐ స్కామ్ లో అధికారుల అవినీతి, వాళ్లకు అనుబంధంగా పని చేసిన వారి రాకెట్ గుట్టు రట్టవుతుంది . దేవికారాణికి మాత్రం ఈఎస్ఐ స్కామ్ లో వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి .