ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులకు రిమాండ్.. ఆ స్కామ్తో సంబంధం లేదన్న నాయిని అల్లుడు..!
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈఎస్ఐ మందుల కుంభకోణంలో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, సీనియర్ అసిస్టెంట్ హర్ష వర్ధన్, ఫార్మాసిస్ట్ రాధిక, ఉద్యోగి నాగరాజుతో పాటు ఓమ్ని మెడి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరికి అక్టోబర్ 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఆ మేరకు ఈ ఐదుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. పక్కా సమాచారంతో బుధవారం ఉదయం 23 చోట్ల సోదాలు నిర్వహించడంతో ఈ గుట్టు రట్టైంది. ఈఎస్ఐ చరిత్రలో పెద్ద స్కామ్గా అభివర్ణిస్తున్న ఏసీబీ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 11 కోట్ల 70 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు వెలుగు చూసింది. అంతేకాదు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని బుధవారం నాడే అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం నాటికి మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
దొంగల్లా మారిన అధికారులు.. ఉపాధి హామీ నిధులు హాంఫట్..!
అదలావుంటే ఈఎస్ఐ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి. అనవసర ఆరోపణలు గుప్పించిన వ్యక్తులపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఏసీబీ విచారణకు సైతం తాను సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు తనకు ఎలాంటి ఫార్మా కంపెనీలు లేవని స్పష్టం చేశారు. తాను ప్రజా ప్రతినిధినని.. రాంనగర్ కార్పొరేటర్ను మాత్రమేనని స్పష్టం చేశారు. కార్మిక సంఘం నేతగా కొనసాగుతున్న తనపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏనాడూ కూడా ఈఎస్ఐ వ్యవహారాలు చూడలేదన్నారు. నాయిని నర్సింహారెడ్డి అల్లుడిగా ప్రజా సేవ మాత్రమే చేశానని.. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా షాడో మంత్రిలాగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు.