ఈఎస్ఐ స్కామ్ ..10 కోట్ల బంగారు ఆభరణాలు మాయం చేసిన దేవికారాణి .. మరోసారి ఏసీబీ దాడులు
తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సుమారు రూ.113 కోట్లకు పైగా కుంభకోణానికి తెర తీశారని విజిలెన్స్ అధికారులు గుర్తించటంతో ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ రంగ ప్రవేశం చేసి ఈ కుంభకోణంలో దర్యాప్తు కొనసాగిస్తుంది.
దేవికారాణి అక్రమాలపై దృష్టి పెట్టి దూకుడు పెంచిన ఏసీబీ
తాజాగా మరోమారు తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. ఏసీబీ అధికారులు మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి లకు సంబంధించి వారు బెయిల్ పై బయటకు వచ్చాక వారి మూమెంట్స్ గమనిస్తున్నారు. ఈ కేసులో తాజాగా పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో మరోసారి ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు . తాజాగా ఈఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కి సంబంధించిన నాలుగు కోట్ల 47 లక్షల రూపాయల నగదును సీజ్ చేసిన ఏసీబీ అధికారులు, దేవికారాణి చేసిన అక్రమాలపై మరోమారు దృష్టిపెట్టారు.
10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయం.... దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు
దేవికారాణి 10 కోట్ల విలువైన ఆభరణాలు మాయం చేసినట్లుగా గుర్తించారు. ఈ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి అక్రమాలకు పాల్పడి, పదవిని అడ్డం పెట్టుకొని పది కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. పక్క రాష్ట్రాల్లోనూ దేవికారాణి ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. దేవికారాణి మాయం చేసిన పది కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాల కోసం ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు.
కమర్షియల్ స్థలం కొనుగోలుకు యత్నించిన దేవికారాణి , నాగలక్ష్మి లు
బెయిల్ పై బయటకు వచ్చిన మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి సైబరాబాద్ లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం బినామీ పేర్లతో పెట్టుబడి పెట్టారు. నాలుగు కోట్ల పైచిలుకు నగదును వారు బిల్డర్ కు చెల్లించారు. ఈ మొత్తంలో దేవికారాణి నగదు రూ.3.37 కోట్లు కాగా, మిగతా మొత్తం నాగలక్ష్మి చెందిన క్యాష్గా చెబుతున్నారు. దీంతో బిల్డర్ వద్దనుండి దేవికారాణి, నాగలక్ష్మిలు పెట్టిన డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు.
డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో విచారిస్తున్న ఏసీబీ .. మరోమారు దాడులు
ప్రస్తుతం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న దేవికారాణి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. దేవికారాణి ఇంట్లో దొరికిన అన్ని పత్రాలను మరోమారు ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా దేవికారాణి బినామీలుగా ఎవరైనా కొనసాగుతున్నారా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేవికారాణి భర్తను, ఆమె కుటుంబ సభ్యులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.