ఈటల రాజేందర్కు మరో షాక్: గులాబీ గూటికి మరో కీలక అనుచరుడు, ఉపఎన్నికపై ఎఫెక్ట్
కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ మాత్రం ఈటలకు షాక్ల మీద షాక్లు ఇస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీకి దూరం కాగా, ఇప్పుడు ఈటల రాజేందర్ కీలక అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కోటి భార్య దేశిని స్వప్న కూడా తాను టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు మంగళవారం ఉదయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా, ఈటల ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్ కూడా రాజేందర్కు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బండా శ్రీనివాస్. విద్యార్ధి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని తన సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న బండా శ్రీనివాస్.. సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్గా బండా శ్రీనివాస్ను జులై 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001లోనే చేరి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో బండా చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో శ్రీనివాస్ పనిచేశారు. వీళ్లే కాకుండా ఈటల అనుచరులుగా ఉన్న చాలా మంది కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్ గూటికే చేరుతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి కొంత బలం పెరిగినట్లయివుతోంది. అయితే, కేసీఆర్ కోట్లు కుమ్మరించి నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు.