తెలంగాణ డబ్బులకు కేసీఆర్ కాపలదారే! ఓనర్ కాదు: తన జోలికి వస్తే ప్రళయమేనంటూ వార్నింగ్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నేరుగా సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్లపైన విమర్శలు గుప్పిస్తున్నారు.
తన జోలికివస్తే ప్రళయమేనంటూ ఈటల రాజేందర్ వార్నింగ్
జమ్మికుంట మండలం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరారు.అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఇక్కడ ధర్మానికి, న్యాయానికి స్థానం ఉంటుంది. మేం ప్రశాంతంగా ఉంటాం మా జోలికి వస్తె ఊరుకోం. దౌర్జన్యం జరిగితే ముందుగా చిందవలసింది నా రక్తపు బొట్టే. కేసులు పెడితే, జైళ్లో పెడితే ముందు నన్ను పెట్టు. అలాగే నేను ప్రజలకు ఏమీ చెయ్యక పోతే 6 సార్లు ఎలా గెలిపించారు. నన్ను ఏం చేతకాని వాడిని అంటావా? నా జోలికి రాకండి. సముద్రం నిచ్చలం గా ఉంటుంది.. తుఫాను వస్తే తెలుస్తుంది దాని ఉదృతం.. ప్రళయం సృష్టిస్తము ఖబర్డార్ అంటూ కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులను హెచ్చరించారు ఈటల రాజేందర్.
కేసీఆర్.. నువ్వు తెలంగాణ డబ్బుకి ఓనర్ కాదు కాపలాడారుడివే
నా కొట్లాట నీలాంటి(టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి) బానిసల మీద కాదు. నా కొట్లాట కేసీఆర్ మీద. కేసీఆర్ డబ్బు సంచులకి నా ధర్మానికి మధ్య ఎన్నిక. తలకాయలు మెదడు ఉంటే.. మనిషి వైతే అడుగుతున్న. రెండు గుంటలున్నవాడు 250 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నడు? ఇదంతా నీ అక్రమ సొమ్ము కాదా అని ప్రశ్నించారు. మా సభకు డప్పులు కొట్టడానికి రాకుండా అడ్డుకున్నారట. దళిత బంధు డబ్బు మా ప్రజల కష్టపడ్డ డబ్బు. కేసీఆర్.. నువ్వు ఈ తెలంగాణ డబ్బుకి ఓనర్ కాదు కాపలాడారుడివి మాత్రమే. ఇది నీ అబ్బ జాగీరు కాదు. నీకు తెలుసు నువ్వు గెలవవు అని. అయినా దింపుడు కళ్ళెం ఆశ పడుతున్నారు. డబ్బులు, మద్యం, నాయకులను పక్కన పెట్టు... నువ్వు పోటీ చెయ్యి అని డిమాండ్ చేసిన. నా చరిత్ర ఉప్పల్, జమ్మికుంట రైల్వే స్టేషన్, కరీంనగర్, మహబూబ్ నగర్ జైళ్లను అడుగు, మానుకోట రక్తపు చుక్కను అడుగు నా చరిత్ర చేపుతుంది అన్నారు ఈటల రాజేందర్.
దమ్ముంటే డబ్బులు, మద్యం, పక్కన పెట్టి పోటీ చెయ్ కేసీఆర్..
నన్ను వెళ్లగొట్టారు. దమ్ముంటే పోటీ చెయ్యి అన్నారు. వినోద్ కుమార్కి ఎక్కడ ఓట్లు రాకపోయినా హుజూరాబాద్లో 57 వేల మెజారిటీ ఇచ్చిన. ఆయన కూడా నన్ను రాజీనామా చేయమన్నారు. చేసి మీ ముందుకు వచ్చిన నన్ను కాపాడుకోండి అని ప్రజలకు సూచించారు. నేను గెలిస్తే తెలంగాణ గెలిచినట్లు అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే డబ్బులు, మద్యం, పక్కన పెట్టి పోటీ చెయ్యాలని కేసీఆర్కు సవాల్ చేశారు ఈటల. తను రాజీనామా చేయడం వల్ల ప్రజలు చాలా మేలు జరిగిందని చెప్పారు. 'నాకు ఓటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట. దళితబంధు నీ అబ్బ జాగీరా.. మిస్టర్ ముఖ్యమంత్రి' అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అంతకు ముందు మన ముఖం చూడని ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో అడ్డాలు పెట్టి మరీ దావత్లు ఇస్తున్నారని ఈటల చెప్పుకొచ్చారు.