టీఆర్ఎస్ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర-పార్టీ అప్రమత్తంతో ముప్పు తప్పింది-గంగుల సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన తరహాలో... టీఆర్ఎస్ విచ్చిన్నానికి,వెన్నుపోటుకు ఈటల కుట్ర చేశారని ఆరోపించారు. పార్టీ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పిందన్నారు. ఆదివారం(జూన్ 13) హుజురాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు.
ఈటల ఎన్ని కుట్రలు పన్నినా హుజురాబాద్ ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఉపఎన్నికలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతామన్నారు. ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న ఈటల... కేవలం తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. తనకన్నా గొప్పవాళ్లు లేరని ఈటల ఊహించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేకల మందపై తోడేలు పడ్డట్లుగా వ్యవహరిస్తున్నారని ఈటల తరచూ చేస్తున్న వ్యాఖ్యలను తప్పు పట్టారు. ప్రజలు మేకలా... మంత్రులు తోడేళ్లా చెప్పాలన్నారు. ఈటలపై తనకేమీ వ్యక్తిగత కోపం లేదని... కానీ ఎదుటివాళ్లు సంబరపడితే ఈర్ష్యపడే వ్యక్తి ఈటల అని విమర్శించారు. ఈటలకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే నల్లచట్టాలు చేసిన కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.హుజురాబాద్ అభివృద్ది చెందాలంటే టీఆర్ఎస్ మరోసారి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ బొమ్మతోనే ఈటల రాజేందర్ గెలిచారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఈటలపై ఇవే ఆరోపణలు చేశారు. శనివారం(జూన్ 12) హుజురాబాద్లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...2003లో పార్టీలో చేరిన ఈటల రాజేందర్కు పార్టీ పదవులతో పాటు కేబినెట్లో అవకాశం కల్పిస్తే పార్టీనే విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నాడని ఆరోపించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ను కూడా గద్దె దింపే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.
ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన మరుక్షణమే హుజురాబాద్పై టీఆర్ఎస్ గట్టి ఫోకస్ పెట్టింది. మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్లో మకాం వేసి ఈటలను ఒంటరి చేసే ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో ఆపరేషన్ హుజురాబాద్ను టీఆర్ఎస్ పక్కాగా అమలుచేస్తోంది.సొంత ఇలాఖాలో ఈటలను ఓడించి కేసీఆర్ను వీడినవాళ్లెవరూ రాజకీయంగా రాణించలేరన్న విషయాన్ని మరోసారి నిరూపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
మరోవైపు,ఈటల కూడా తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. 20 ఏళ్లుగా తనను గెలిపిస్తున్న హుజురాబాద్ ప్రజలు మళ్లీ తననే ఆశీర్వదిస్తారని చెబుతున్నారు. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని... ధర్మానికి,అధర్మానికి మధ్య పోరాటమని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి,టీఆర్ఎస్ సభ్యత్వానికి శనివారం(జూన్ 12) ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే స్పీకర్ రాజీనామాను ఆమోదించారు. ఆపై అసెంబ్లీ కార్యదర్శి హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికపై ఈసీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.