పుష్కరాలు వివక్షకు గురయ్యాయి: ఈటెల, స్వచ్ఛ భద్రాచలం: తుమ్మల
హైదరాబాద్: సొంత రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్వహించుకున్నామని ఆర్ధిక మంత్రి ఈటెల్ రాజేందర్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... పుష్కరాలను ఘనంగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో తెలంగాణలో పుష్కరాలు వివక్షకు గురయ్యాయని అన్నారు. పుష్కరాల్లో భాగంగా ఆరు కోట్ల మంది భక్తులకు పుష్కర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పుష్కరాల్లో చిన్న చిన్న అపశ్రుతులు జరిగాయని, అయినా భక్తులు ఇబ్బందులు పడకుండా చూశామని చెప్పుకొచ్చారు.
పుష్కరాల్లో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ వచ్చే మేడారం జాతర, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి విజయవంతం సాధిస్తామని చెప్పారు.
త్వరలో స్వచ్ఛ భద్రాచలం: తుమ్మల నాగేశ్వరరావు
గోదావరి పుష్కరాల్లో భాగంగా ఏర్పడిన వ్యర్ధాలను తొలగించేందుకు త్వరలో స్వచ్ఛ భద్రాచలంను నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వచ్ఛ భద్రాచలంలో జిల్లా యంత్రాంగమంతా పాల్గొంటుందని చెప్పారు.
ఇక రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల తదితర పథకాలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తాజా మార్పులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు.
గత పదేళ్లలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్న నాయకులా మమ్మల్ని విమర్శించేది అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన తాజా మార్పులపై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్నదంతా విషపూరిత ప్రచారమని అన్నారు.