'అప్పుడు రూ.10వేల కోట్లు ఖర్చు చేయలేదు, ఇప్పుడు ఏటా రూ.50వేల కోట్లు'
పదిహేను ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన 25వ డివిజన్కు కసితో నిధులు మంజూరు చేస్తున్నామని, రోడ్లు, మురుగు కాల్వలు కట్టించే బాధ్యత తనదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
కరీంనగర్: పదిహేను ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన 25వ డివిజన్కు కసితో నిధులు మంజూరు చేస్తున్నామని, రోడ్లు, మురుగు కాల్వలు కట్టించే బాధ్యత తనదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
గురువారం 25వ డివిజన్ పోచమ్మవాడలో రూ.100 కోట్ల పనుల్లో భాగంగా రూ.కోటితో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత తీసుకున్న డివిజన్కు రూ.7.50 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు.
2005లో పార్టీ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ అని, ఆనాడు అధికారంలో ఉన్న మేయర్ ఎన్నో ఆఫర్లు ఇచ్చారని, అయినా పార్టీని, ప్రజల అభీష్టానికి కట్టుబడి గులాబీ జెండాను పట్టుకొని ఉన్నారని, ఇన్నాళ్లు నిరీక్షించిన ప్రజల రుణం తీర్చడం జరుగుతోందన్నారు.
కరీంనగర్లోని వరదంతా ఈ డివిజన్లకే వస్తోందని, ఈ వరద నీటిని తప్పించడానికి రూ.5 కోట్లతో వరద కాల్వ కట్టిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా డివిజన్ పరిధిలో రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు వేయిస్తున్నామన్నారు.
రూ.170 కోట్లతో కమాన్ నుంచి సదాశివపల్లికి రాజీవ్ రహదారి తరహాలో రోడ్డు వేస్తుండటంతో దీనికి మణిహారంగా ఉంటుందన్నారు. ఇప్పటికే రూ.50లక్షలతో సామూహిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.
డివిజన్లోని అన్ని వీధుల్లో 8 నెలల్లో రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. వర్షం పడితే చాలు నగరంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రాకుండా రూ.వందకోట్లతో పనులు చేస్తున్నట్లు వివరించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.10వేల కోట్లు ఆ ప్రభుత్వం ఖర్చు చేయలేదని, ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న తాను ఏటా రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో అభివృద్ధికి ప్రభుత్వం నయాపైసా ఇచ్చేది కాదని, పైగా నగరాన్ని ఎక్కడికి అక్కడే ధ్వంసం చేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో నగరానికి రూ.వందల కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, నగర మేయర్ రవిందర్సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, డివిజన్ కార్పొరేటర్ కట్ల విద్య, సతీష్, నగరపాలక కమిషనర్ కె.శశాంక తదితరులు పాల్గొన్నారు.