నీతి లేని నేతలకు నోటాతో బుద్ది చెప్పండి..! ఖమ్మంలో ఓ వృద్ధుడి వినూత్న ప్రచారం..!!
ఖమ్మం/హైదరాబాద్: ఓ పెద్దాయన ఎన్నికల సందర్బంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అంతే అనుకున్న వెంటనే రంగంలోకి దిగిపోయాడు. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనో, ఓటు శక్తిని చాటి చెప్పేందుకో, నాయకుల గుణగణాల గురించి ప్రజలకు చెప్పేందుకో ఆయన వీధుల్లోకి రాబడం లేదు, కేవలం నోటా కు ఎలా ఓటు వేయాలో ప్రజలకు చెప్పేందుకు మాత్రమే ఆయన ముందుకు కదులుతున్నారు.
రాజకీయాల్లో సిద్దాంతాలు లేని నేతలను పాతరేయాలి..!అందుకు నోటా బెస్టు అంటున్న ఖమ్మం వాసి..!!
పార్టీ ఫిరాయింపు నేతల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పెద్ద మనిషి మళ్లీ అదే వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఎలా ఓడించాలి, నోటాకు ఓటు వేసి ఎలా నిరశన తెలపాలి అనే అంశం పై ప్రజల్లో పెద్ద యెత్తున చైతన్యం తెచ్చేందుకు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇంతకీ ఇంతటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎవరు, ఎక్కడ, ఎందుకు తెలుసుకుందాం..!!
ప్రజల మరనోభావాలు పట్టని నేతలను తరిమేయాలి..! వినూత్న ప్రచారం చేస్తున్న పెద్దాయన..!!
తెల్లని గడ్డం, తలపై వస్త్రంతో ఉన్న ఈయన పేరు మాటూరు వెంకటసుబ్బారావు. ఊరు ఖమ్మం. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ నోటాపై ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. పార్టీ మారుతున్న నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారుతున్నారు. ఓటేసిన ప్రజలను మోసగిస్తున్నారు'అంటూ ఆయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
రాజకీయాల్లో సిద్దాంతాలు లేకపోతే ఎలా..? అలాంటి నేతలు ఎందుకని ప్రశ్నిస్తున్న ఓ వృద్ధుడు..!!
సిద్ధాంతాలు లేని నాయకులకు నోటాతో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఈ రాజకీయ నేతలు అవసరం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారులున్నారని చెప్పారు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో 4,991 ఓట్లు నోటాకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో 12,941 ఓట్లు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో నోటాపై ప్రచారం చేస్తున్నా. మంచి నేతను ఎన్నుకుంటే నీతివంతమైన పాలన వస్తుంది' అంటూ వెంకటసుబ్బారావు చెప్పారు.
వృద్ధుడి ప్రచారానికి ముగ్దులౌతున్న యువత..! నోటా ఆయుధానికి పనిచెప్తామంటున్న యువకులు..!!
వెంకట సుబ్బారావు చేస్తున్న ప్రచారం వినూత్నంగా ఉండడంతో పాటు నూతన ఆలోచనలు రేకిత్తించేవిగా ఉన్నాయని యువత భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల వెనక ప్రజల మనోభావాలు ఇంతటి స్థాయిలో పెనవేసుకుంటాదయా అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి ప్రజలమనోబావాలను కించపరిచిన నేతలకు నోటాతో బుద్ది చెప్పాలనే నిర్ణయానికి వచర్చినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి మార్పు వస్తే రాజకీయాల్లో కొంతైనా విశ్వసనీయత ఉంటుందనే చర్చ జరుగుతోంది.