lockdown:బీపీఎల్ కుటుంబానికి రూ.5 వేలు, 12 కిలోల నాణ్యమైన బియ్యం ఇవ్వండి: అఖిలపక్షం
రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి నెలకు రూ.5 వేలు అందజేయాలని అఖిలపక్షం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అందజేసే రూ.1500 సరిపోవడం లేదని.. ఇంట్లో నలుగురు ఉంటే నెలకు రూ.400 చొప్పున ఏం ఖర్చుచేయాలని ప్రశ్నించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సమావేశమయ్యారు. వివిధ సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
బీపీఎల్ కుటుంబాలకు...
రేషన్ కార్డు ఉన్నవారికే కాకుండా బీపీఎల్ కుటుంబాలకు, రేషన్ కార్డు కోసం ఆప్లై చేసినవారికి కూడా నగదు అందజేయాలని కోరారు. లాక్ డౌన్ వల్ల పనిలేకపోవడంతో.. ప్రభుత్వం అందజేసే నగదుతో కుటుంబాలు నడుస్తాయని చెప్పారు. అయితే 3 నెలల నుంచి రేషన్ తీసుకొని వారికి నగదు బ్యాంకులో జమచేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. వారికి కూడా అందజేయాలని.. వారంతా 4.5 లక్షల మంది వరకు ఉంటారని తెలిపారు. 12 కిలోల బియ్యం ప్రభుత్వం అందజేస్తే కొందరు వాటిని విక్రయిస్తున్నారని గుర్తుచేశారు. అలా విక్రయించి ఇతర రైస్ కొనుగోలు చేయొద్దంటే.. నాణ్యమైన బియ్యం అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
దీపం పథకం కింద బియ్యంతోపాటు పప్పు, ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని.. దాని గురించి కూడా సీఎస్ను అడిగారు. వైరస్ సమయంలో చనిపోయిన కుటుంబసభ్యులను ఆదుకోవాలని కోరారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో చిక్కుకొన్న తెలుగువారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. ఆకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీఎస్ను అఖిలపక్ష నేతలు కోరారు.
Recommended Video
ఆప్లై చేసినవారికి కూడా..
రేషన్ కార్డు ప్రతిపాదికన రేషన్ అందజేస్తున్నారని.. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్ ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరాం తెలిపారు. దీంతో రాష్ట్రంలోని చాలామంది పేదలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తాము చెప్పిన అంశాలపై సీఎస్ సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. సీఎస్ను కలిసిన వారిలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, చాడ వెంకటరెడ్డి, చెరకు సుధాకర్ ఉన్నారు.