తెలంగాణ టీచర్లకు తీపి కబురు: ఇక నెలనెలా ప్రమోషన్లు
హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇది పండగ లాంటి వార్తే. ఎందుకంటే.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నెలనెలా ప్రమోషన్లు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
ఈ మేరకు సోమవారం విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ నిర్ణయంపై పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర నాయకులు, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయుల పనితీరు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ గిరిజన గురుకులాల్లో 516 పోస్టుల భర్తీ
తెలంగాణలోని గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 516 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 16 ప్రిన్సిపాల్, 350 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 50 వ్యాయామ ఉపాధ్యాయులు, 18 ఆర్ట్స్, 32 సంగీత ఉపాధ్యాయుల, 50 స్టాఫ్ నర్సుల పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రత్యక్ష నియామకాల ద్వారా లోకల్ కేడర్, రోస్టర్ నిబంధనల మేరకు, అర్హులతో ఈ పోస్టులను భర్తీచేయాలని టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. గిరిజన సంక్షేమ శాఖ వెంటనే ఆర్థిక శాఖకు ఖాళీ పోస్టులు, అర్హతలు, ఇతర అంశాల వివరాలను అందించాలని సూచించింది.