అన్నీ కేసీఆరే..! అంతా సాహసమే..! ఇక మిగిలింది ప్రజాతీర్పే..!!
హైదరాబాద్: తెలంగాణలో ఆపథర్మ ముఖ్యమంత్రి కల్మకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా సంచలనమే..! ఉద్యమ పార్టీ మొదలు పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఎన్నో సంచలనాలు స్రుష్టించారు కేసీఆర్. ఒక రకంగా కేసీఆర్ అడుగులే సామసోపేతంగా ఉంటాయనే చర్చ కూడా ఉంది. తాజాగా అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు, అభ్యర్థుల ప్రకటన అన్ని అంశాలు కూడా సంచనల నిర్ణయాలే..! ఎవరూ ఊహించని రీతిలో ఒకేసారి 105 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ అభ్యర్ధుల ప్రకటనపై టీఆర్ఎస్ వర్గాల నుంచే మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న వారికి కూడా టిక్కెట్లు ఇచ్చారని, ఇది ప్రతికూల ఫలితాలకు దారి తీయవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబూమోహన్, నల్లాల ఓదేలుకు మెండి చేయిచూపిన చంద్రశేఖర్ రావు, పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఖరారు చేశారు.
Recommended Video
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించడం తమకే లాభమంటున్న కాంగ్రెస్..!!
పార్టీ మారిన 12 మంది టీడిపి ఎమ్మెల్యేలకు తిరిగి అదే స్థానాల్లో టికెట్లు కేటాయించడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత తమ గెలుపు మరింత సులభం అయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏంటో చూపిస్తుందని, పార్టీ మారిని ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు ఉన్న ఆగ్రహమే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఆపథర్మ ముఖ్యమంత్రిగా ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ఒక్కటంటే ఒక్క సహేతుక కారణం చెప్పలేని చంద్రశేఖర్ రావుతో ప్రజాక్షేత్రంలో అమీ తుమీ తేల్చుకుంటామని కాంగ్రెస్ తేల్చి చెప్తోంది.
కేసీఆర్ చెప్పిన కారణమే సహేతుకం..! తాను నమ్మిందే సిద్దాంతం..!
తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సంబంధించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిన కారణం చాలా వింతగా ఉంది. గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ అసహన., అతి ప్రవర్తన పెరిగిపోయిందని, దీని వల్ల ప్రగతి ఆగిపోయే అవకాశం ఉందని అందుకే ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నది ప్రభుత్వపరంగా ఎలాంటి కారణం చెప్పని చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అనేలా మాట్లాడటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ఈ ఏడాది కూడ 21.96 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రగతి చక్రం ఆగిపోకూడదనే ముందస్తుకు వెళ్తున్నట్టు నర్మగర్బంగా తెలిపారు చంద్రశేఖర్ రావు.
తనకనుసన్నల్లో మెలిగే వారికి అవకాశం ఇచ్చిన కేసీఆర్..! అంతా చాణక్యమే..!
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేకర్ రావు తొలి రోజే పెద్ద సాహసం చేయడంతో పాటు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ముందుగా చెప్పినట్లుగా సిట్టింగ్లందరికీ దాదాపుగా టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరికి మాత్రమే మొండి చేయి చూపారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్కు మాత్రం టిక్కెట్లు నిరాకరించారు. బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధోల్ నుంచి జర్నలిస్ట్ క్రాంతికి టిక్కెట్ ఇవ్వగా, చెన్నూరు అభ్యర్ధిగా ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్కు టికెట్ కేటాయించారు. టికెట్ల కేటాయింపు విషయంలో అప్పుడే టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయి.
రగిలిపోతున్న అసంత్రుప్తులు..! తిరుగుబాటుకు రెఢీ అంటున్న గులాబీలు..!
కొండా సురేఖ, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దానం నాగేందర్ వంటి నేతల పేర్లు ఈ జాబితాలో లేకపోవడంతో అంతా ఆయోమయానికి గురవుతున్నారు. ఇంక పద్నాలుగు మంది పేర్లు ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు ఈ అనూహ్య పరిణామానికి తెలంగాణ ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ నిర్ణయం పట్ల అక్కడి వారు మిశ్రమ స్పందన కనబరుస్తున్నారు. తామంతా నమ్మి ఓట్లు వేస్తే అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తుండగా, మంచి నిర్ణయమే తీసుకున్నారంటూ కొందరు వెనకేసుకొస్తున్నారు.