అంతా సిద్దం.. కల్వకుంట్ల తారకరామారావు అనునేను..! అనేదే తరువాయి..!!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. అందులో భాగాంగా ఇంకొన్ని రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేటీఆర్ పునరాగమనం ఖాయమని వార్తలొస్తున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పే ఛాన్సొస్తుందేమోనని చంద్రశేఖర్ రావు ఆశించారు. ఢిల్లీలో తాను, తెలంగాణ సీఎంగా తన కుమారుడు కేటీఆర్ ఉండొచ్చని భావించారు. కానీ, అంచనాలు తలకిందులయ్యాయి. ఆకాశంలో కట్టిన పేక మేడలు... మోదీ సుడిగాలితో కూలిపోయాయి. అనివార్యంగా తెలంగాణకే పరిమితం కావాల్సొచ్చింది. దీంతో ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తూ వచ్చిన మంత్రివర్గ విస్తరణపై సీఎం చంద్రశేఖర్ రావు ఇప్పుడు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
మంత్రి వర్గంలోకి కేటీఆర్..! త్వరలో కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ..!!
పార్టీ పగ్గాలను ఇప్పటికే తన తనయుడు, కేటీఆర్ కు అప్పగించేశారు. ఇక మిగిలింది... సీఎం పీఠం. ఎంపీ ఎన్నికల ఫలితాలు ఆశించినట్టుగా వస్తే... అర్జంటుగా సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టేవారే. ఆ ఎన్నికల పోరులో అనుకున్న ఫలితాలు రాలేదు కాబట్టి, కాస్తంత పునరాలోచనలో పడ్డారు చంద్రశేఖర్ రావు. యువరాజా వారికి ఇప్పటికిప్పుడే కాకుండా, ఇంకొన్నాళ్ల తరువాత పట్టాభిషేకం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారట. అప్పటిదాకా, ట్రైనింగ్ ఇచ్చేందుకని, మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారట. వరుస ఎన్నికల కారణంగా ఇన్నాళ్లపాటు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలన్నీ అయిపోయాయి. ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా ఉంది. ఒకటి రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా ముగుస్తాయి. అవంత ముఖ్యం కాదు కాబట్టి, విస్తరణే ముఖ్యమని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కసరత్తు పూర్తి చేసిన కేసీఆర్..! నేడోరేపో మూహూర్తం ఖరారు..!!
గత మంత్రివర్గంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. దేశ విదేశాలు తిరిగి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సులను దిగ్విజయంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఉత్తమ మంత్రిగా అవార్డులు అందుకున్నారు. ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. మంత్రివర్గంలో ఆయన లేకపోవడంతో, ఆయా శాఖల్లో చురుకుదనం లోపించిందట. అందుకే, కేటీఆర్ ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారట. ‘కాబోయే సీఎంను మంత్రివర్గానికి దూరంగా ఉంచడం మంచిది కాదు' అని,చంద్రశేఖర్ రావు తో ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు చర్చ జరుగుతోంది.
కేటీఆర్ కు కీలక శాఖ..!ఆమోదం తెలిపిన కేసీఆర్..!!
పక్క రాష్ట్రమైన ఏపీలో యువ కెరటంలా జగన్ దూసుకురావడం, సీఎం పీఠాన్ని అధిష్టించడం, హామీల అమలు, వేగవంతమైన నిర్ణయాలు, సంచలనాలు సృష్టించడం... ఇలా అన్నింటిలో రేసు గుర్రంలా వాయు వేగంతో ముందుకెళుతున్నారు. తన కుమారుడైన యువరాజా కేటీఆర్ ను కూడా అదే స్థాయిలో చూడాలని చంద్రశేఖర్ రావు ఉవ్విళ్లూరుతున్నారట. అందుకే, ఈ కలను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే, మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారట. ఇమేజ్ పెరిగిన తరువాత, సీఎం పీఠంపై కూర్చోబెడతారట. అందుకేనేమో... సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, తన సొంత జిల్లాల్లోని కొన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను కూడా వాయిదా వేశారట. మంత్రి హోదాలో ప్రారంభోత్సవం చేసేందుకే ఇలా వాయిదా వేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
హరీష్ పరిస్థితి ఏంటి..! తెలంగాణ వాదులను తొలుస్తున్న ప్రశ్న..!!
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావు కు తెలంగాణ వాదులు కొన్ని సలహాలు అందిస్తున్నారు. కేసీఆర్ సారూ...! మీ ఆలోచలన్నీ బాగానే ఉన్నాయి. కానీ, కేటీఆర్ తో సమానుడైన... పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఆపత్కాలంలో పార్టీని ఆదుకున్న, కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించిన హరీశ్ రావును ఏం చేద్దామంటారు...? ఈ ముక్క కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో రాజా....!! అసలే, మన తెలుగు రాజకీయాల్లో ‘అల్లుడి' గారి అలక ప్రభుత్వాలకు అంత మందచిది కాదనే సూచనలను చంద్రశేఖర్ రావు కు చేస్తున్నట్టు తెలుస్తోంది.