రిగ్గింగ్ ఎక్కడ జరిగిందంటే?: బీజేపీ గెలుపుపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. 2014లో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ ఒంటరిగా 300కు పైగా సీట్లు సాధించింది. క్రితంసారి 282 సీట్లు సాధించిన కమలం ఇప్పుడు ఇరవై సీట్లు ఎక్కువగా గెలిచింది. ఎన్డీయే కూటమికి క్రితంసారి 330కి పైగా సీట్లు రాగా, ఈసారి 350కి పైగా వస్తున్నాయి. నరేంద్ర మోడీ పాలనను ప్రజలు విశ్వసించారని ఈ లెక్కలు చెబుతున్నాయి.
చదవండి: తెలంగాణలో బీజేపీకి ఊహించని గెలుపు, కేసీఆర్ 'హిందుగాళ్లు-బొందుగాళ్లే' కారణమా?
బీజేపీ అద్భుత విజయం
ఉత్తరాదిన బీజేపీ పట్టు నిలబెట్టుకుంది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో కమలం పార్టీ నిలబెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోను సత్తా చాటింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో రెండు మూడు సీట్లు మినహా అన్ని స్థానాలు బీజేపీయే గెలిచింది. ఇక్కడ మినహా దక్షిణాదిన పెద్దగా సీట్లు దక్కించుకోని కమలం పార్టీ తెలంగాణలో మాత్రం ఊహించని విజయం సాధించింది. ఒకటి రెండు సీట్లు కూడా కష్టంగా వస్తాయనుకుంటే ఏకంగా 4 లోకసభ స్థానాల్లో గెలిచి అధికార తెరాసకు గట్టి షాకిచ్చింది. బీజేపీ గెలుపును ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్వాగతించారు.
అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీవీప్యాట్ 100 శాతం విశ్వసిస్తున్నానని అభిప్రాయపడ్డారు. వోటింగ్ మిషన్లోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్స్ 100 శాతం సరిపోయాయని చెప్పారు. ఈవీఎంల రిగ్గింగ్ జరగలేదని, హిందువుల మైండ్ను మాత్రం రిగ్గింగ్ చేశారని (బీజేపీ నేతలు రిగ్గింగ్ చేశారు) సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసదుద్దీన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఇలా
అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై నెటిజన్లు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మీరు చెప్పినట్లు హిందువుల మైండ్ రిగ్గింగ్ కాలేదని, మీలాంటి హిందూ వ్యతిరకవాదుల వల్ల హిందువులు అంతా ఏకమయ్యారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. హిందూ మైండ్స్ ట్రాన్సాఫార్మ్ జరిగిందని మరో నెటిజన్ అన్నారు. హిందువులు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారని మరొకరు అభిప్రాయపడ్డారు.