చేతి గుర్తుకు ఓటు వేస్తే కారుకు పడుతోంది: కోమటిరెడ్డి ఆగ్రహం, ఈవీఎంలో ఇలా...
Recommended Video
భువనగిరి: సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటు వేస్తుంటే మరో పార్టీకి పడుతోందని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో చాలా పోలింగ్ బూత్లలో టీడీపీ సింబల్ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తుకు పడుతోందని ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది.
ఏమైందో తెలియాలి: ఓటేసిన పవన్ కళ్యాణ్, ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్ట్! ఏం జరిగిందంటే?
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చేతి గుర్తుకు ఓటు వేస్తుంటే కారు గుర్తుకు పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. భువనగిరి లోకసభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి పోటీ చేస్తున్నారు. తాజాగా, ఆయన కూడా ఆరోపణలు చేశారు.
కోమటిరెడ్డి గురువారం నల్గొండ పబ్లిక్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దాదాపు పది పోలింగ్ కేంద్రాల్లో ఎవరికి ఓటు వేసినా వీవీప్యాట్ స్లిప్పుల్లో కారు గుర్తు మాత్రమే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ నిలిపి వేయాలన్నారు. ఎన్నికల్లో ఏవైనా అవకతవకలు జరిగితే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు.
కాగా, సోషల్ మీడియా, వాట్సాప్లలో ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది. భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హస్తం గుర్తుకు వేస్తుంటే ఆ ఓటు టీఆర్ఎస్ పార్టీకి పడుతోందని చెబుతూ.. చేతి గుర్తు వద్ద ప్రెస్ చేస్తే కారు గుర్తు వద్ద వెలిగినట్లుగా ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు.