జానారెడ్డికి ఝలక్.. దిగ్గజ కాంగ్రెస్ నేతకు తప్పని ఓటమి.. ఎంత తేడాతో ఓడారంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలకు గట్టి షాక్ తగిలింది. సమైక్య ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలో సీనియర్ నేత జానారెడ్డికి ప్రత్యేక చరిత్ర ఉంది. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చేపట్టిన అనుభవం, ఘనత జానాకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ సారి జరిగిన ఎన్నికల్లోనూ గెలిస్తే సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందని కలలుగన్నారు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
అత్యధిక కాలం మంత్రిగా
భారత దేశ రాజకీయాల్లో అత్యధికంగా మంత్రి పదవిలో కొనసాగిన రికార్డు జానారెడ్డికి ఉంది. ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా ఉన్న అనుభవం జానారెడ్డికే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరుఫున నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి పోటీ చేశారు.
జానారెడ్డిని నిలదీసిన ప్రజలు
తాజా ఎన్నికల ప్రచారంలో ఆది నుంచే జానారెడ్డికి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడూ లేని విధంగా ప్రజలు జానారెడ్డిని నిలదీశారు. ఓ దశలో సహనం కోల్పోయిన జానా.. మీరు ఓటు వేయకపోయిన ఫర్వాలేదు. నాకు ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు అని ప్రజలపై నోరుజారారు. చివరకు నోముల నర్సింహయ్య చేతిలో సుమారు 9400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
గతంలోనూ ఓటమి
జానారెడ్డికి తన రాజకీయ జీవితంలో ఇది రెండో ఓటమి. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో తన నియోజకవర్గాన్ని విశేష స్థాయిలో అభివృద్ది చేశారు. తన అభివృద్దిని చూసి ప్రజలే గెలిపిస్తారని ఆత్మవిశాసంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాంతో ఆయన తొలిసారి ఓటమిపాలయ్యాడు.
పలు ప్రభుత్వాల్లో మంత్రిగా
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగిన ఆయన చంద్రబాబు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతోపాటు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కూడా పనిచేశారు.