ఔటర్ ప్రమాదం: రక్తం కారుతుండగా 108కి ఫోన్ చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్: సోమవారం రాత్రి హైదరాబాద్ సమీపంలో తుక్కుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిడిపి నేత, మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఓ వైపు తల నుంచి రక్తం కారుతున్నా.. రోడ్డు పైన కొద్ది దూరాన పడి ఉన్న భార్య, కారు డ్రైవర్లను చూసి పిన్నమనేని తీవ్రంగా కలత చెందారు. దీంతో, ఓ వైపు తల నుంచి రక్తం కారుతున్నా ఆయన తన సెల్ ఫోన్ తీసి 108కి స్వయంగా ఫోన్ చేశారని తెలుస్తోంది.
ఔటర్పై కారుబోల్తా: ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేనికి తీవ్రగాయాలు, భార్య మృతి
ఈ మేరకు అపోలో ఆసుపత్రి వద్ద పిన్నమనేని సోదరుడు మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. 108కు ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగిందన్న విషయం తన సోదరుడు చెప్పలేకపోతున్నారని తెలిపారు.
పిన్నమనేని ప్రయాణిస్తున్న కారు ఔటర్ పైన బోల్తా కొట్టిన ఆ ఘటనలో ఆయన సతీమణి సత్యవాణి, కారు డ్రైవర్ దాసు అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పిన్నమనేనికి తల నుంచి తీవ్ర రక్త స్రావం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సత్యవాణి, డ్రైవర్లు ఎగిరి పడ్డారు. సీటు బెల్టు కారణంగా పిన్నమనేని కారు నుంచి బయటపడలేదు.
పరామర్శించిన స్పీకర్ కోడెల
రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వర రావును ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ పరామర్శించారు. పిన్నమనేని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పిన్నమనేని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పిన్నమనేని సతీమణి సత్యవాణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.