మాజీఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్, భార్య, కుమారుడికి కూడా, ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తోన్న పోలీసులను కూడా వదలడం లేదు. అయితే బీజేపీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని భార్య, కుమారుడికి కూడా పరీక్షలు చేయగా.. వారికి కూడా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 199 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ సమయంలో చింతల రామచంద్రారెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలా అందజేసిన సమయంలో వైరస్ ప్రబలి ఉంటుందని భావిస్తున్నారు. వైరస్ నిర్ధారణ తర్వాత అతని, భార్య కుమారుడికి కూడా పరీక్షలు చేశారు. వారికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ముగ్గురికి జూబ్లీహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కరోనా పాజిటివ్ సోకడంపై చింతల రామచంద్రారెడ్డి స్పందించారు. తనకు వైరస్ సోకిందని.. అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఆందోళన చెందొద్దని బీజేపీ శ్రేణులు, కార్యకర్తలను కోరారు. వాస్తవానికి లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైన్స్ తెరవడం, బస్సులను నడపడంతో ఆ సంఖ్య రెట్టింపవుతోంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను సడలించినట్టు తెలుస్తోంది. కానీ వైరస్ కేసులు మాత్రం తీవ్రస్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.