చిరంజీవి బాటలో ys sharmila -ఇతరుల్ని ముంచడానికే పార్టీ -జగన్ తప్పిన మాటిదే: గోనె ప్రకాశ్
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీ అయిపోయిన వైఎస్ షర్మిలను ఉద్దేశించి.. వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల అచ్చంగా మెగాస్టార్ చిరంజీవిని అనుసరిస్తున్నారని, కొత్త పార్టీ ఏర్పాటుకు గల కారణాలు, తల్లి వైఎస్ విజయమ్మ పాత్రలను కూడా ఆయన ప్రస్తావించారు.
Recommended Video
జగన్ మాట తప్పినందుకే..
వైఎస్ షర్మిల పార్టీ ప్రయత్నాలపై గోనె ప్రకాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ కుటుంబంలో కలహాలతోనే షర్మిల పార్టీ పెడుతున్నారని అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి షర్మిలకు టికెట్ ఇస్తానన్న జగన్ మాట తప్పాడని, ఆ తర్వాత 2020లో రాజ్యసభకు పంపుతానని మరోసారి మడమ తిప్పారని, ఈ రెండు అంశాలకు తోడు కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా షర్మిల-జగన్ మధ్య విభేదాలకు కారణం అయ్యాయని ప్రకాశ్ తెలిపారు.
పొంగులేటి దగ్గర ప్యాకేజీ
గతంలో వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగానే కాకుండా, వైసీపీ నుంచి ఖమ్మం లోక్ సభ సీటులో గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి నుంచి ప్యాకేజీలు తీసుకుని, 2014లో 119 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను నిలిపితే.. జగన్, షర్మిల, విజయమ్మలు కేవలం ఖమ్మంలోనే మూడు రోజులపాటు పర్యటించారని ప్రకాశ్ గుర్తుచేశారు. కేవలం కుటుంబ కలహాల కారణంగానే షర్మిల కొత్త పార్టీ పెడుతోందని చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటోన్న షర్మిల.. తనకు పదవి దక్కకపోవడంపై జగన్నే అడగాలని బాహాటంగా చెప్పడం గమనార్హమన్నారు. కాగా,
చిరంజీవి బాటలో షర్మిల
గతంలో మెగాస్టార్ చిరంజీవి అత్యంత అట్టహాసంగా ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీ వల్ల వందలాది మంది అమాయకులు బలైయ్యారని, చాలా మంది నేతలు టికెట్ల కోసం భూములు అమ్మి.. స్వరం కోల్పోయారని గుర్తుచేసిన గోనె ప్రకాశ్.. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా చిరంజీవి బాటలోనే నడుస్తోందని, ఈమె పార్టీని నమ్మిన వాళ్లు కూడా ప్రజారాజ్యం నేతల్లాగే బలికాక తప్పదని వ్యాఖ్యానించారు. ఇలా రాజకీయ పార్టీలు పెట్టి ఇతరులను ముంచొద్దని హితవు పలికారు.
విజయమ్మ ఫోన్లు.. వైఎస్ ప్రతిష్ట..
అన్న జగన్ తో విభేదాలు ముదరడం వల్లే షర్మిల అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారని, నాటి చిరంజీవి లాగే రేపటి షర్మిల పార్టీ పరిస్థితి తయారవుతుందని గోనె జోస్యం చెప్పారు. అన్నాచెల్లెళ్ల పోరులో తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆశీర్వాదం షర్మిలకు ఉందని, అందుకే అందరికీ విజయమ్మ ఫోన్ చేస్తున్నారని గోనె తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టి రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చుకోవొద్దని షర్మిలకు హితవు పలికారు.
వైఎస్ భారతికి పదవీ కాక్ష..
షర్మిల పార్టీని ఉద్దేశించి చేసిన తాజా వ్యాఖ్యల్లోనూ వైఎస్ భారతి పేరును ప్రస్తావించారు గోనె ప్రకాశ్. జగన్ సతీమణి భారతికి పదవీ కాంక్ష ఉందని, గూడు కదులుతోందంటూ.. షర్మిల భర్త అనిల్ ఆ మధ్యలో చేసిన పోస్టు కొత్త పార్టీ గురించే అని, జగన్ సీఎం అయ్యాక షర్మిల ఇంత వరకు తాడేపల్లికి వెళ్లలేదని ప్రకాశ్ గుర్తుచేశారు.