కెసిఆర్తో జయప్రద: బాబుకు ధైర్యం లేదన్న తలసాని
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద శనివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్ను ఆహ్వానించారు. కెసిఆర్కు జయప్రద వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద కెసిఆర్ను కోరారు. భేటీ తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడారు తన సోదరి కూతురు పెళ్లికి ఆహ్వానించేందుకు మాత్రమే కెసిఆర్ను కలిసినట్లు తెలిపారు. కెసిఆర్ను మర్యాదపూర్వకంగానే కలిసి, తమ ఇంట జరిగే పెళ్లికి ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ధైర్యం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిధులు విడుదల చేయాలని అడగడానికి భయపడుతున్నారని ఆయన శనివారం అన్నారు
పేదరికం లేని సమాజాన్ని తెస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తన కుటుంబ ఆస్తులను సరి చూసుకోవాలని ఆయన సూచించారు. తలసాని శ్రీనివాస యాదవ్ తెలుగుదేశం పార్టీకి, శానససభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను మంత్రి పదవి కూడా వరించింది.