ఎమ్మెల్సీగా కవిత..నేడే నామినేషన్: సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం: కేబినెట్ లోకి ఖాయం...!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె కవితను శాసనమండలికి పంపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన..ఆ వెంటనే ఈ రోజు మధ్నాహ్నం లోగానే నామినేషన్ దాఖలు చేసే విధంగా ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావటంతో..అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత పార్టీ ముఖ్యులతో ముఖ్యమంత్రి ఈ విషయానికి సంబంధించి చర్చించి..చివరకు కవిత పేరును ఖరారు చేసారు. అయితే, త్వరలోనే కవిత మంత్రివర్గంలోనూ చేరటం ఖాయంగా తెలుస్తోంది.
Recommended Video
నేడే కవిత నామినేషన్..
కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ సభ్యుల ఎంపికలో కవితకు అవకాశం దక్కుతుందని చివరి నిమిషం వరకు ప్రచారం సాగింది. ఆ తర్వాత కాలంలో కవిత ప్రజా క్షేత్రం నుంచి గెలిచి వస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా మారిన సమీకరణాలతో సిటింగ్ ఎంపీ కె.కేశవరావు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురే్షరెడ్డికి పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. వారు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే బుధవారం వారిద్దరి ఏకగ్రీవ ఎన్నికపై ఈసీ అధికార ప్రకటన చేయనుంది. ఈ దశలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున కవిత పేరు తెరపైకి వచ్చింది. దీని పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తుది చర్చల తరువాత కవికు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్లుగా పార్టీ నేతలతో వెల్లడించారు. దీంతో...ఈ రోజే కవిత పేరును పార్టీ అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించటంతో పాటుగా నామినేషన్ సైతం ఈ రోజే దాఖలు చేయనున్నారు.
రెండేళ్లే పదవి..జిల్లాపై పట్టు కోసం
టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రె్సలో చేరిన డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో..ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంకు ఉప ఎన్నిక జరుగుతోంది. అర్ధంతరంగా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ నిలిచినప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత ఇబ్బంది లేకుండా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ ఓట్లు 592 కాగా, కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 142, బీజేపీ ఓట్ల సంఖ్య 90. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున బుధ, గురువారాల్లో నామినేషన్లు దాఖలు కానున్నాయని తెలుస్తోంది. ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితులు..పార్టీ పైన పట్టుకోసమే కవితను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
మంత్రి పదవీ ఖాయమంటూ..
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కవిత ఎన్నిక లాంఛనమేనని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె ఎమ్మెల్సీగానే పరిమితం కారని.. కాబోయే మంత్రి అనే చర్చ అప్పుడే మొదలైంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిటింగ్ ఎంపీగా కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ, ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఓటమిపాలైన నుంచి కవిత నియోజకవర్గంతో కొంత దూరం పాటిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన సురేష్ రెడ్డికి రాజ్యసభ..ఇప్పుడు కవితకు ఎమ్మెల్సీ కేటాయించి జిల్లా పైన పార్టీ పట్టుకోసం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. కవిత ఎన్నిక కానున్న ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం జనవరి 4, 2022న ముగిశాక, మళ్లీ అదే స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుస్తారని వివరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నాటికి కవితను మంత్రిగా చూడటం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది.