టీఆర్ఎస్ అండతోనే నయీం దందాలు : మధుయాష్కీ
హైదరాబాద్ : రెండు రోజుల్లోగా వార్తల్లో నానుతున్న గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారం.. రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. రాజకీయ నేతలు, అధికారులపై ఆరోపణలతో ఎప్పుడు ఏ వార్త బయటకొస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే.. పార్టీల నడుమ పరస్పర ఆరోపణల పర్వం కూడా కొనసాగుతోంది. నయీం ఎన్ కౌంటర్ పై తాజాగా స్పందించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ టీఆర్ఎస్ పై పలు ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అండదండలతోనే రెండేళ్ల నుంచి నయీం విచ్చలవిడిగా రెచ్చిపోలేదా.. అని ప్రశ్నించిన ఆయన, మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.
టీఆర్ఎస్ నేతలు, ఉన్నతాధికారుల అండదండలు తోడవడంతోనే నయీం దందాలకు పాల్పడ్డాడని ఆరోపించారు మధుయాష్కీ. అధికార పార్టీ నేతలు భూదందాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే నయీం ఎన్ కౌంటర్ జరిగిందని విమర్శించారు.
కాంగ్రెస్ టీడీపీలే నయీంను ప్రోత్సాహించాయని ఆరోపిస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. రెండేళ్ల నుంచి అధికారంలో ఉండి ఏం చేసిందని నిలదీశారు. కేసు నుంచి అధికార పార్టీ నేతలను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు మదుయాష్కీ. 2004లోనే నయీంపై కేసు పెట్టానని చెబుతోన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి రెండేళ్ల నుంచి ఏం చేశారని ప్రశ్నించారు. నయీం చేతిలో హతమైన సాంబశివుడు, రాములు టీఆర్ఎస్ పార్టీలే కదా, ఆ కేసుల గురించి టీఆర్ఎస్ ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదని అన్నారు.