లాయర్ దంపతుల హత్య : అంతా రెండు గంటల్లోనే జరిగిందా? ఒక్కడినే చంపాలనుకున్నారు...కానీ..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. హత్యకు రెండు గంటల వ్యవధిలోనే ప్లాన్ చేసి.. దాన్ని అమలుచేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. చాలారోజులుగా వామన్రావును అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్న కుంట శ్రీను అందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం(ఫిబ్రవరి (17) వామన్రావు దంపతులు మంథని కోర్టుకు రావడం... బిట్టు శ్రీను సహాయ,సహకారాలు అందించడంతో కుంట శ్రీను హత్యకు పాల్పడ్డాడు.
రెండు గంటల వ్యవధిలోనే జరిగిందా..?
వామన్రావు దంపతులు ఆరోజు మధ్యాహ్నం 11.30గంటల సమయంలో మంథని కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా కల్వచర్ల వద్ద హత్యకు గురయ్యారు. కోర్టుకు రావడం,హత్యకు గురవడం... ఈ రెండింటి మధ్య కేవలం రెండున్నర గంటల వ్యవధి మాత్రమే ఉన్నది. ఈ వ్యవధిలోనే కుంట శ్రీను వామన్రావు దంపతుల హత్యకు స్కెచ్ వేసి అమలుచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హత్యకు మూడు రోజుల ముందు నుంచే స్కెచ్ గీశారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.
రెక్కీ... హత్య...
కేసులో ఏ-3గా ఉన్న అక్కపాక కుమార్తో కుంట శ్రీను కోర్టు వద్ద రెక్కీ నిర్వహించాడు. కుమార్ ఎప్పటికప్పుడు వామన్రావు కదలికలపై సమాచారం అందించాడు. ఇదే క్రమంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో కలిసి హత్య గురించి కుంట శ్రీను చర్చించాడు. ఇద్దరు కలిసి స్పాట్ ఫిక్స్ చేశారు. అనంతరం అనుకున్నట్లుగానే రామగిరి మండలం కల్వచర్ల వద్ద వామన్రావు దంపతుల కారును తమ కారుతో అడ్డగించి దాడికి పాల్పడ్డారు. కుంట శ్రీను,శివందుల చిరంజీవి ఇద్దరూ కలిసి వారిని దారుణంగా హతమార్చారు.
ఒక్కడినే చంపాలనుకున్నారు... కానీ..
ఈ హత్యకు బిట్టు శ్రీను కారు,కత్తులు సమకూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంథనిలోని ఓ షాపులో వాటిని కొనుగోలు చేసి కారులో పెట్టినట్లు తెలుస్తోంది. అదే కారును బిట్టు శ్రీను కుంట శ్రీనుకు ఇవ్వడంతో.. చిరంజీవితో కలిసి అతను కల్వచర్ల సమీపంలోని స్పాట్ వద్దకు వెళ్లాడు. అక్కడే వామన్రావు కోసం ఎదురుచూసి... అతని కారు కనిపించగానే వెంబడించి అడ్డగించాడు. ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. నిజానికి వామన్రావు ఒక్కడినే చంపాలనేది కుంట శ్రీను ప్లాన్ అయినప్పటికీ... స్పాట్లో నాగమణి కూడా ఉండటంతో సాక్ష్యాధారాలు లేకుండా ఆమెను కూడా హత్య చేసినట్లు తెలుస్తోంది.
సీన్ రీకన్స్ట్రక్షన్...
ఏ-1 కుంట శ్రీను,ఏ-2 శివందుల చిరంజీవి,ఏ-3 అక్కపాక కుమార్లతో పోలీసులు శుక్రవారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ముందు నిందితులను హాజరుపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు బిట్టు శ్రీను అరెస్టు తర్వాత అతని బాధితులు తెరపైకి వస్తున్నారు. ఇనుముల సతీష్ అనే మాజీ వార్డు సభ్యుడు మాట్లాడుతూ... గతంలో కుంట శ్రీను,బిట్టు శ్రీను తనపై బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. 2018లో పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తులపై తాను కేసు వేయడంతో... దాన్ని ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఆ కేసును వామన్రావు దంపతులే వాదించినట్లు చెప్పారు.
బిట్టు శ్రీనుపై మాజీ వార్డు సభ్యుడు సతీష్ ఆరోపణలు
తాను కేసును వెనక్కి తీసుకోకపోవడంతో తనను అంతమొందించేందుకు కుంట శ్రీను సుపారీ మాట్లాడాడని సతీష్ ఆరోపించారు. కుంట శ్రీను,బిట్టు శ్రీను కలిసి తన హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో అప్పట్లోనే బయటకు రాగా అప్పటి డీజీపీ,రామగుండం పోలీస్ కమిషనర్కు ఆ ఆడియో టేపును అందించినట్లు చెప్పారు. ఇప్పటివరకూ పోలీసులు దానిపై ఏమీ తేల్చలేదని వాపోయారు. తనతో పాటు మొత్తం నలుగురిని టార్గెట్ చేశారని... ఒకరిపై పీడీ యాక్ట్ పెట్టారని,మరొకరిని లొంగదీసుకున్నారని చెప్పారు. చివరకు వామన్రావును హత్య చేశారని,ఇక తానే మిగిలానని,తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.