మితిమీరిన ప్రచారమే టీఆర్ఎస్ కొంప ముంచింది..!!
హైదరాబాద్ : ఎదో అడగాలని అడగలేక, చెప్పాలని చెప్పలేక.. ఎందుకో అధైర్యం., క్షిణించిన ఆత్మ విశ్వాసం.,లోపించిన స్పష్టత., ఎదో వెలితి., ఎదో దాపరికం., ఎక్కడో తేడా., ఎందుకో ఆత్మ న్యూనతా భావం., ఎదో అసంతృప్తి., ఎక్కడో నిరాశ.,మరేదో నిట్టూర్పు ఇవన్నీ కల గలిసిన సమావేశమే ప్రగతి నివేదన..! ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు మొదటిసారి ప్రజాక్షేత్రంలో విఫలమయ్యారు. కర్ణుడి చావుకు కారణం వెదకడం ఎంత వ్యర్థమో నిన్నటి ప్రగతి నివేదన సభలో విఫలం చెందడానికి కారణం వెదకడం కూడా అంతే అనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు హైప్ ఒస్తే అద్భుంతంగా ఉండేది కాని., హైప్ ఒచ్చే ప్రకటన చేస్తారనే మితిమీరిన ప్రచారమే గులాబీ నేతల కొంపముంచినట్టు తేలిపోయింది.
Recommended Video
పథకాల పురోగతి కన్నా సెంటిమెంట్ సెగనే కేసీఆర్ నమ్మినట్టు తెలుస్తోంది..!
కరపత్రాలు పంచటానికి పాతిక లక్షల మందితో సభ పెట్టాలని ఎవరైనా ఊహిస్తారా..? పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి, ముందస్తు ఎన్నికలకు సమాయత్తం చేయాలనుకున్న కెసీఆర్ లో ఎందుకంత నిస్తేజం, నిరుత్సాహం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వంద సీట్లు వస్తాయన్న కెసీఆర్ లో ఆ జోష్ ఏదీ?. కొంగరకలాన్ సభ ఎందుకంత చప్పగా నిస్తేజంగా సాగింది. ఎన్నో ఆశలు, అంచనాలతో మొదలైన సభలో నిరాశా, నిట్టూర్పులు ఆవహించటానికి కారణమేంటి? టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన జనం, అందులో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ప్రసంగం చూసిన తర్వాత అందరూ నిరుత్సాహానికి గురయ్యారనేది మాత్రం వాస్తవం.
సభకు ముందే కేసీఆర్ లో నిరుత్సాహం..! అందుకే పేలగా ఉపన్యాసం..!!
ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సభలో మాట్లాడింది పాత కేసీఆరేనా? అన్న అనుమానం అందరిలో తలెత్తింది. ఎందుకంటే ఆ సభ అంత చప్పగా ముగిసింది. కాంగ్రెస్ పై మాట్లాడిన ఆ నాలుగు విమర్శలు కూడా లేకపోతే ఇది మరింత చప్పగా ఉండేది. ఈ సభకు హాజరైన జనాన్ని చూసి కెసీఆర్ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే చంద్రశేఖర్ రావు తన స్పీచ్ ముగియగానే వేదిక దిగి వెళ్లిపోయారు. కనీసం ధన్యవాద తీర్మానం పూర్తయ్యే వరకూ కూడా వేదికపై ఉండలేదు.
ఊరించి ఉసూరుమనిపించినట్టుంది వ్యవహారం..! పంచ్ లు లేని ప్రసంగం..!
అత్యంత హైప్ క్రియేట్ చేసిన ఈ సభ పేరే ‘ప్రగతి నివేదన సభ'. అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పి, మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెబుతారని ప్రకటించారు. అన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయని కెసీఆర్ సభా వేదిక నుంచే ప్రకటించారు. అంతే కాదు, సభకు హాజరైన వారికి కరపత్రాలు కూడా పంచామని చెప్పారు. కళాకారులు కూడా బాగా చెప్పారు అని వ్యాఖ్యానించారు. అంటే కేవలం కరపత్రాలు పంచేందుకు 25 లక్షల మందితో సభ పెట్టాలని అనుకున్నారా..? 25 లక్షల టార్గెట్ పెట్టుకుంటే సభకు హాజరైన వారి సంఖ్య కేవలం 4 నుంచి 5 లక్షల మధ్యలోనే ఉంటుందని పోలీసు వర్గాలే నివేదికలు సమర్పించాయి.
జనాన్ని చూసి కేసీఆర్ నిరుత్సాహం..! కేసీఆర్ స్పీచ్ చూసి జనం నిరుత్పాహం..!!
కెసీఆర్ తన ప్రసంగంలో ఎక్కువ సమయం తన నాలుగేళ్ళ పాలన కంటే తెలంగాణ రాక ముందు జరిగిన సంఘటనలపై చెప్పేందుకే ప్రయత్నించారు. కాస్తో..కూస్తో మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నమే కనపడింది. ఈ సభా వేదికపై కెసీఆర్ వ్యవహరించిన తీరు పార్టీ నేతలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటంలో కెసీఆర్ ను మించిన వారెవరూ లేరు?. అలాంటి కెసీఆర్ ఎందుకు ఇంత చప్పగా, ప్రసంగించారు అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న? అమలు చేసిన సంక్షేమ పథకాలు అనుకూల ఫలితాలు ఇస్తే అవి చెప్పుకొవడానికి కేసీఆర్ ఎందుకు జంకారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి అసంత్రుప్తి అనే విత్తనం తెలంగాణ సమాజంలో నాటుకుందని, త్వరలో అది మహావ్రుక్షంగా మారడం ఖాయమని ప్రతిపక్షాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.