నోట్ల మార్పిడిపై ఆందోళన వద్దు: ఆర్బీఐ వద్ద మార్చుకోవచ్చు
ప్రజలు తమ పాత నోట్లను బ్యాంకులలో జమ చేసుకోవచ్చని, ఒక వేళ మార్పిడి చేసుకోవాలనుకుంటే ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది.
న్యూఢిల్లీ/హైదరాబాద్: నవంబర్ 24తో పాత నోట్ల మార్పిడి అవకాశం అన్ని బ్యాంకులలో ముగియడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత రిజర్వు బ్యాంక్ పేర్కొంది. ప్రజలు తమ పాత నోట్లను బ్యాంకులలో జమ చేసుకోవచ్చని, ఒక వేళ మార్పిడి చేసుకోవాలనుకుంటే ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది.
రద్దైన రూ. 500, 1000 నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద మార్చుకోవచ్చని తెలిపింది. ప్రజల కోసం అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఈ పాత నోట్ల(రూ.2వేల వరకు) మార్పిడికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
పాత నోట్ల మార్పడిని రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం ప్రకటన జారీ చేసింది. కాగా, పాత రూ. 500 నోట్లతో కొన్ని చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు గడువును పెంచిన విషయం తెలిసిందే.
మీ రూ.500 నోట్లు ఎక్కడ చెల్లుబాటు అవుతాయి?
కాగా, పెద్ద నోట్ల మార్పిడి ఇతర బ్యాంకులలో నిలిచిన నేపథ్యంలో దేశంలోని ఆర్బీఐ కార్యాలయాల వద్ద జనం బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్బీఐ కార్యాలయం వద్ద కూడా తమ నోట్లను మార్చుకునేందుకు భారీగా ప్రజలు చేరుకున్నారు.