త్వరలో రెండో లిస్ట్, సినీ పెద్దల వారసులు?: వీరంతా సాక్షులేనా?
డ్రగ్ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) రెండో జాబితాను దాదాపు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశముందని
హైదరాబాద్: డ్రగ్ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) రెండో జాబితాను దాదాపు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశముందని అంటున్నారు.
మరికొంతమందికి నోటీసులు ఇస్తామని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇప్పటికే చెప్పారు. ఇందులోప్రముఖులు ఉంటారని తేలడంతో వారు ఎవరు అనే చర్చ సాగుతోంది. రెండో జాబితాలో సినీ ప్రముఖులు, ఇతర రంగాల పెద్దలు ఉన్నారు.
ఒత్తిడి వస్తోందని చెబుతూనే..
రెండో జాబితాలో ఉన్న వారి పేర్లు బయట పెట్టవద్దని తనపై ఒత్తిడి వస్తోందని అకున్ సబర్వాల్ ఇటీవల చెప్పారు. అయినప్పటికీ ఆ పేర్లు బయట పెట్టేందుకు సిద్ధమన్నట్లుగా ఆయన ఉన్నారని తెలుస్తోంది. రెండో జాబితాపై సీరియస్గా వర్క్ చేస్తున్నారు. సమాచారం మేరకు, రెండో జాబితాలో సినీ రంగానికి చెందిన వారినే మరికొందరిని విచారణకు పిలవనున్నారు. ఎక్కువ మంది సాక్షులేనని తెలుస్తోంది.
Recommended Video
వారిని నిందితులుగా చూపించేందుకు..
జిషాన్, కెల్విన్ల విచారణలో పలువురి పేర్లు వెలుగు చూశాయని, వారి నుంచి పారిశ్రామికవేత్తల పిల్లలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, సినీ ప్రముఖులు భారీగా డ్రగ్ తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. కేసులో ఇటీవల అరెస్టైన కమింగా విచారణ కూడా కీలకం కానుందని చెబుతున్నారు. ఇప్పటి దాకా జరిపిన విచారణలో ఒక డైరెక్టర్, ఇద్దరు యువ నటులు, ఒక నటిని నిందితులుగా చూపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
విచారణ ఎవరెన్ని గంటలు అంటే..
ఇప్పటి వరకు సిట్ పలువురు ప్రముఖులను విచారించింది. పూరి జగన్నాథ్ 11 గంటలు, శ్యామ్ కె నాయుడు 6, సుబ్బరాజు 13, తరుణ్ 13, నవదీప్ 11, చిన్నా 4, చార్మి 6, ముమైత్ఖాన్ 6, రవితేజ 9, రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాస్ 4 గంటలు విచారణ ఎదుర్కొన్నారు.
తొలి ఛార్జీషీట్
కెల్విన్, జీషన్ల అరెస్ట్ తర్వాత 12మంది సినీ ప్రముఖులను, మరో ప్రయివేటు వ్యక్తిని విచారణకు పిలిచారు. ఇప్పటి వరకు 10 మందిని విచారించారు. తనీష్, నందుల విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో తొలి చార్జిషీట్ తీసుకురానున్నారు. ఇప్పటి దాకా విచారణకు హాజరైన వారిందరి పేర్లు చార్జిషీట్లో ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా సాగిన విచారణలో డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించి సిట్ కీలక సమాచారం రాబట్టింది. వాడకందారులతో పాటు అమ్మకందారుల గుట్టును కనిపెట్టింది.