పరిస్థితి మారలేదు: మాదాపూర్లో మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
హైదరాబాద్: తెరిచి ఉన్న మ్యాన్హోల్ ఓ యువకుడి ప్రాణం తీసింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని మాదాపూర్లో మ్యాన్హోల్లో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం జార్ఖండ్కు చెందిన మోతీయాదవ్ (24) బతుకుదెరువు నిమిత్తం 5 నెల క్రితం నగరానికి వలస వచ్చాడు.
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదాపూర్లోని రాక్ ఎన్ గ్రిల్ హోటల్లో టీ మాస్టర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో మెగాహిల్స్ సమీపానికి రాగానే వర్షం మరింత ఎక్కువగా పడుతుండటంతో సమీపంలో ఉన్న వైన్ షాపు వద్ద ఆగాడు.
ఇంతలో అటుగా వెళ్తున్న ఓ ఆటో మ్యాన్హోల్లో దిగపడింది. మోతీ యాదవ్తో పాటు మరికొంతమంది ఆ ఆటోను లాగేందుకు ప్రయత్నించారు. అనుకోకుండా మోతీ యాదవ్ అదుపుతప్పి మ్యాన్హోల్ గుంతలో పడిపోయాడు. అదే సమయంలో విద్యుత్ వైరు తెగిపడటంతో ఆ నీళ్లకు షాక్ వచ్చింది.
దీంతో అక్కడున్నవారు వెనక్కు తగ్గారు. అయితే మ్యాన్హోల్లో ఇరుక్కుపోయిన మోతీయాదవ్కు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఈ ఘటనకు కారణమైన మ్యాన్హోల్ కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.