బల్దియా పీఠం కారుదే: ఏ సర్వేలు ఎన్ని సీట్లిచ్చాయి?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)పై గులాబీ జెండా ఎగురబోతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలుపుతున్నాయి. మంగళవారం పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని పలు చానళ్లు, సర్వే సంస్థలు ఎగ్జిట్పోల్ వివరాలను వెల్లడించాయి. ఇందులో టీఆర్ఎస్కు కనిష్ఠంగా 77 స్థానాలనుంచి గరిష్ఠంగా 85 స్థానాలు వస్తాయని తేలింది.
కాంగ్రెస్ చావు దెబ్బ తినబోతోంది. ఆ పార్టీకి కనిష్ఠంగా మూడు నుంచి గరిష్ఠంగా 12 స్థానాలు వస్తాయని ఆయా సంస్థలు అంచనా వేశాయి. ఎంఐఎం కనిష్ఠంగా 32 స్థానాలనుంచి గరిష్ఠంగా 45 స్థానాలు పొందే అవకాశం ఉందని చెప్పాయి. గతంతో పోల్చితే ఎంఐఎంకు కొన్ని స్థానాలు తగ్గుతాయని అంచనా వేశాయి.
ఎంఐఎం బలంగా ఉందని భావించే పాతబస్తీలోనూ టీఆర్ఎస్ ఖాతాలు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ-టీడీపీ కూటమికి కనిష్ఠంగా 20నుంచి గరిష్ఠంగా 34 స్థానాల వరకు లభించే అవకాశాలు ఉన్నట్టు తేల్చాయి. ఇతరులు గరిష్ఠంగా మూడు స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపాయి. అటు నిఘావర్గాలు నిర్వహించిన సర్వేలోనూ టీఆర్ఎస్కు 80నుంచి 85 సీట్లు ఖాయమని తేలింది.
గ్రేటర్లోని 5 జోన్లలలో ప్రతీ జోన్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే అత్యధిక సంఖ్యలో గెలవబోతున్నారని సర్వేల్లో స్పష్టమయ్యింది. ప్రత్యేకించి సికింద్రాబాద్, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లను టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేస్తుందని పలు సర్వే సంస్థలు, చానళ్లు ప్రకటించడం గమనార్హం.
సంక్షేమ పథకాలే..
రాష్ట్రం ఆవిర్భవించిననాటి నుంచి ఇప్పటి వరకు తాను అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మెచ్చేలా ప్రచారం చేసుకోవడంలో అధికార టీఆర్ఎస్ పూర్తిగా సఫలమైంది. టీఆర్ఎస్ ఇంటిపార్టీ అనే నమ్మకాన్ని నగర ప్రజల్లోనూ కల్గించగలిగింది. ఆంధ్రపార్టీలుగా చెలామణి అవుతున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లను కాదని, టీఆర్ఎస్కు సెటిలర్లు కూడా భారీ స్థాయిలో మద్దతు పలికినట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తున్నదని ఆరా అనే సర్వే సంస్థ తెలిపింది.
ఓటుకు నోటు కుంభకోణం వెలుగు చూసిన తర్వాత పరిణామాలను తనకు అనుకూలంగా, టీడీపీకి ప్రతికూలంగా మార్చడంలో కేసీఆర్ విజయవంతమయ్యారని ఆరా సంస్థ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్ను తానేనని ప్రజలను ఒప్పించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతమయ్యారని తెలిపింది. అదే సమయంలో ఏ పార్టీలోనూ కేసీఆర్ స్థాయిలో నాయకులు లేకపోవడాన్ని ఆరా సంస్థ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ముఖ్యంగా సీఎం తనయుడు, మంత్రి కేటీ రామారావు ఐటీ, ప్రైవేటు ఉద్యోగుల మదిని దోచేరీతిలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు కూడా నగరంలో టీఆర్ఎస్ గెలుపును ఖరారు చేశాయన్న అభిప్రాయాన్ని చానళ్లు, సర్వే సంస్థలు వ్యక్తం చేశాయి. మొత్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్థి పథం నగర ఓటర్లను గణనీయంగా ఆకర్షించింది.
షాదీముబారక్, కల్యాణలక్ష్మి, పింఛన్లు, నగరంలో విద్యుత్, నల్లా బకాయిల మాఫీవంటి కార్యక్రమాలతో భవిష్యత్తులోనూ నగరవాసులకు భరోసా నింపగల కార్యక్రమాలను టీఆర్ఎస్ చేపట్టగలదన్న విశ్వాసం ఓటింగ్ సరళిపై స్పష్టంగా కనిపించింది.
బీజేపీ, టీడీపీలకు సంప్రదాయ ఓటర్ల దెబ్బ
టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా భావించే కులాలు, బీజేపీ మద్దతుదారులుగా భావించే కులాలు కూడా ఈసారి టీఆర్ఎస్ పక్షాన నిలిచినట్టు ఆరా సంస్థ తెలిపింది. దానికితోడు, ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ టీడీపీ-బీజేపీ మధ్య తగిన సయోధ్య కొరవడిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఆరా సంస్త అంచనా ప్రకారం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు...
టిఆర్ఎస్ - 81 నుంచి 85, మజ్లీస్ - 32 నుంచి 37, టిడిపి - బిజెపి కూటమి 25 నుంచి 30, కాంగ్రెసు - 3 నుంచి 7, ఇతరులు - 3
టీవీ5 (ఎఫ్ఎంఆర్ఎస్) సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు
టిఆర్ఎస్ - 77, మ్జజ్లీస్ 41, టిడిపి - బిజెపి కూటమి 24, కాంగ్రెసు 7, ఇతరులు 1
ఎన్టీవీ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు
టిఆర్ఎస్ - 75 నుంచి 85, మజ్లీస్ 40 నుంచి 45, టిడిపి - బిజెపి కూటమి - 20 నుంచి 25, కాంగ్రెసు 10 నుంచి 12, ఇతరులు 1 నుంచి 3
టీవీ9 సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు
టిఆర్ఎస్ - 78 నుంచి 82, మజ్లీస్ - 35 నుంచి 40, టిడిపి - బిజెపి కూటమి 28 నుంచి 34, కాంగ్రెసు 8 నుంచి 10, ఇతరులు 1 నుంచి 3
నిఘా వర్గాల ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు
టిఆర్ఎస్ - 80 నుంచి 85, మజ్లీస్ 25 నుంచి 30, టిడిపి - బిజెపి కూటమి 22 నుంచి 25, కాంగ్రెసు 8 నుంచి 12, ఇతరులు సున్నా.