హుజుర్నగర్లో ఇండిపెండెంట్ల దెబ్బ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. నేతల గుండెల్లో గుబులు..!
హైదరాబాద్ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ల హవా కనిపించనుందా? స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు భారీగా చీల్చే అవకాశాలు ఉన్నాయా? ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉందని భావిస్తున్నప్పటికీ మెజార్టీ చాలా తక్కువగా ఉండే ఛాన్సుందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు గత ఫలితాలు కొంతలో కొంత సమాధానంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే ఇదే విషయం బోధపడుతుంది. స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 10 శాతం ఓట్లు కొల్లగొట్టనున్నారని వెల్లడించింది ఓ సర్వే సంస్థ. అదే గనక జరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపనుంది.
హుజుర్నగర్ వైపు రాష్ట్ర ప్రజల చూపు
రాష్ట్ర ప్రజల చూపు ఇప్పుడు ప్రధానంగా హుజుర్నగర్ వైపు మళ్లింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ నలుగురు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందనేది నామినేషన్ల నాటి నుంచి వినిపిస్తున్న మాట.
కారుకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
అయితే హుజుర్నగర్ సెగ్మెంట్కు సంబంధించి గత చరిత్ర చూసినట్లయితే ఇండిపెండెంట్ల హవా కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హుజుర్నగర్లో ఏ పార్టీ జెండా ఎగరనుందనేది హాట్ టాపికైంది. ఆ క్రమంలో సోమవారం (21.10.2019) నాడు ఎన్నికల తంతు ముగిశాక సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కారుకే పట్టం కట్టాయి. అక్కడ టీఆర్ఎస్ పార్టీదే విజయమని పలు సర్వే సంస్థలు తమ అంచనాలు ప్రకటించాయి.
ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్లో అపర చాణక్యుడు..
ఇతరులు 10 శాతం ఓట్లు కొల్లగొడతారా?
హుజుర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజా నాడి పసిగట్టిన నాలుగు సర్వే సంస్థలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ప్రకటించాయి. అయితే ఆరా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఇతరులు దాదాపు 10 (9.57) శాతం ఓట్లు కొల్లగొట్టనున్నారని తేలింది. ఇక ఇతర సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా అంతో ఇంతో ప్రభావం చూపనున్నాయనే విధంగా లెక్కలు వేశాయి. అలా ఈ లెక్కల ప్రకారం చూసినట్లయితే ప్రధాన పార్టీల ఓట్లు చీలే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికలో 11 వేల ఓట్లకు గండి
హుజుర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. 2018, డిసెంబర్ నెలలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 85.96 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి ఎన్నికల సందర్భంగా బీజేపీ, సీపీఐ, బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులతో పాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 11 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. అందులో ఓ స్వతంత్ర అభ్యర్థి 4 వేల 944 ఓట్లు సాధించడం విశేషం.
హుజుర్నగర్లో కారుదే జోరు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. గెలుపు మాదే అంటున్న కేటీఆర్
2014 నుంచి 2018 నాటికి తగ్గిన మెజార్టీ
2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ స్థానంలో 81.51 శాతం పోలింగ్ నమోదైంది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 23 వేల 924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదే 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నాటికి మెజార్టీ అతి దారుణంగా పడిపోయింది. అప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినప్పటికీ కేవలం 7 వేల 466 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. ఆయనకు 92 వేల 996 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 85 వేల 530 ఓట్లు వచ్చాయి.
ఈసారి 20 వేల ఓట్లు చీలుతాయా?
ఈ ఉప ఎన్నికలో 84.15 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంటే 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లకు గాను దాదాపు 2 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు లెక్క. అయితే ఓ సర్వే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇతరులు దాదాపు 10 శాతం ఓట్లు పొందే ఛాన్సుంది. ఈ లెక్కన దాదాపు 20 వేల ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 20 వేల ఓట్లు చీలుతున్నాయంటే ఆషామాషీ కాదు. అది గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్సుంది. అందుకే ఏ పార్టీ గెలిచినా మెజార్టీ మాత్రం వేయి, రెండు వేలకు మించే పరిస్థితి కనిపించడం లేదు.
ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో మరో ట్విస్ట్.. అప్పుడేమో నటితో పరార్..! ఇప్పుడేమో మరో కోణం..!
భారీ మెజార్టీ కష్టమేనా?.. వేయి, రెండు వేలేనా?
బీజేపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు 20 వేల ఓట్లు చీల్చగలిగితే ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా భారీ మెజార్టీ కష్టమేననే విషయం స్పష్టమవుతోంది. వేయి, రెండు వేల ఓట్లతో బయటపడతారే తప్ప వేలకు వేల మెజార్టీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 11 వేల ఓట్లు చీల్చిన ఇండిపెండెంట్లు ఈసారి 20 వేల వరకు ఓట్లు చీల్చనున్నారనే సంకేతాలు రావడానికి మరో కారణం ఉంది.
తీన్మార్ మల్లన్న ఎఫెక్ట్ ఉంటుందా?
టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధిస్తున్న తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం.. బడుగు, బలహీన వర్గాలు ఆయనకు మద్దతు ఇవ్వడంతో ఆయన కూడా ఓట్లు భారీగా చీల్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి ఎలాంటి లెక్కలు వేసినా.. ఏ సర్వేలు చూసినా.. గెలుపు గుర్రం ఎవరనేది తేలాలంటే రెండు రోజులు ఆగితే సరిపోతుంది. ఈ నెల 24వ తేదీ గురువారం నాడు ఓటర్ల నాడి నిక్లిప్తమైన ఈవీఎంలు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నాయి.