మామూలు స్కెచ్ కాదు: సినిమా చూపించేశాడు, నిండా మునిగిన వ్యాపారి
హైదరాబాద్: అతనో ఫర్నీచర్ వ్యాపారి. ప్రవృత్తి మాత్రం బాబా. తన దివ్యదృష్టితో ఏమైనా చేయగలనని నమ్మబలుకుతాడు. ఇటీవల ఓ వ్యాపారి అతని వలలో పడటంతో ఏకంగా 'మగధీర' సినిమా చూపించాడు. గుప్త నిధులన్నాడు.. నువ్వు మైసూరు మహారాజువీ అన్నాడు.. గత జన్మలోని నీ రాజకన్య మళ్లీ పుట్టిందన్నాడు.. చెప్పిందల్లా నమ్ముతూ పోయిన ఆ వ్యాపారి చివరకు నిండా మునిగాడు.
అసలేంటీ వ్యవహారం:
రాజేంద్రనగర్ గోల్డెన్ కాలనీకి చెందిన మెహతాబ్ హుస్సేన్ అలియాస్ ఆదిల్(40), అతని మూడో భార్య సకీనా ఫాతీమా ఫర్నీచర్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈజీ మనీ కోసం అదిల్ భూత వైద్యుడి అవతారం ఎత్తాడు. స్నేహితుడు అజం ద్వారా అదిల్ కు కర్ణాటకలోని బీదర్ జల్సంగీకి చెందిన వ్యాపారి రుస్తుంపటేల్(42)పరిచయమయ్యాడు.
గుప్త నిధుల పేరుతో:
రుస్తుంపటేల్ గతంలో చిన్న గోల్కొండలో నివాసమున్న సమయంలో అదిల్ తో అతనికి పరిచయం ఏర్పడింది. తనకు దివ్యదృష్టి ఉందని, ఆసిఫ్జాహి, టిప్పు సుల్తాన్, కుతుబ్షాహిల కాలంలో దాచిన గుప్త నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో తనకు తెలుసునని అదిల్ అతన్ని నమ్మించాడు.
తవ్వకాల్లో ఏమి దొరకలేదు..:
అదిల్ మాటలు విని గుప్త నిధుల తవ్వకాల కోసం రూ.8లక్షలు రుస్తుం పటేల్ అతనికి ఇచ్చాడు. డబ్బు ముట్టిన తర్వాత రుస్తుం పటేల్ చేత జలసంగీలో తవ్వకాలు జరిపించాడు. కానీ అక్కడ ఏమీ లభ్యం కాలేదు. దీంతో మంచి మనసుతో నీవు కార్యం తలపెట్టలేదని అతనిపై నెపం వేశాడు.
'మగధీర' కథ చెప్పాడు..:
గుప్త నిధుల సంగతి పక్కనపెడితే.. '4వేల ఏళ్ల క్రితం సాక్షాత్తూ నీవు మైసూర్ మహారాజువి. అప్పటి రాజకన్య అయిన నీ భార్య ఇప్పుడు మైసూర్ లో పుట్టింది' అంటూ మగధీర తరహా సినిమా కథ చెప్పేశాడు. చెప్పడమే కాదు.. ఆమె నీకు ప్రేమ లేఖలు కూడా రాసిందని కట్టుకథలు అల్లాడు. ఆమె కోటీశ్వరురాలు అని ఆమెతో పెళ్లి జరిపిస్తానని చెప్పి అందినకాడికి కాజేశాడు.
రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని..:
తన వద్ద ఉన్న రైస్ ఫుల్లింగ్ యంత్రం ఉందని మరో నాటకానికి కూడా తెరలేపాడు అదిల్. యంత్రం విలువ అంతర్జాతీయ మార్కెటులో రూ.2500కోట్ల వరకు ఉంటుందన్నాడు. దాని ద్వారా కోట్లు సంపాదించవచ్చునని నమ్మించి రూ.3కోట్ల వరకు గుంజాడు.
భారీ ఆస్తులు:
రుస్తుం పటేల్ వద్ద నుంచి గుంజిన డబ్బుతో అదిల్ బాగానే ఆస్తులు కూడబెట్టాడు. గోల్కొండ ప్రాంతంలో 2000 గజాల స్థలం, చింతల్మెట్లో ఓ భవనాన్ని నిర్మించాడు. అలాగే పలుమార్లు విదేశీ టూర్స్ కూడా వెళ్లి వచ్చాడు.
ఇలా వెలుగులోకి:
రుస్తుం పటేల్ మాటలన్ని మాటలకే పరిమితం కావడం.. క్రమంగా తన వద్ద మరింత డబ్బు గుంజడం అదిల్ పై అతనికి అనుమానం కలిగించింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే.. హబీబ్నగర్ రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ తో రూ.8.5లక్షలు ముట్టజెప్పి రుస్తుం పటేల్ ను బెదిరించాడు. దీంతో బాధితుడు పురానిహవేలీ పోలీసులను ఆశ్రయించడంతో నిజాలు బయటపడ్డాయి.