తెలంగాణా యాపిల్ నోరూరిస్తుంది: ప్రయోగం సక్సెస్ అయ్యి ఆ రైతు పంట పండింది
తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ పంట పండింది. తెలంగాణ రైతన్న చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఒకప్పుడు కాశ్మీర్, సిమ్లా వంటి ప్రాంతాలకు సంబంధించిన యాపిల్స్ రుచినే ఆస్వాదించిన మనకు ఇప్పుడు తెలంగాణ యాపిల్ రుచి నోరూరించనుంది. తెలంగాణా యాపిల్ మార్కెట్లో సందడి చేయనుంది. చల్లని వాతావరణంలో మాత్రమే సాగయ్యే ఆపిల్ పంటను ఇప్పుడు తెలంగాణలో కూడా సాగు చేసి శభాష్ అనిపించుకున్నారు ఓ రైతు. చేతికొచ్చిన పంటను సీఎం కేసీఆర్ చేతికందించి తెలంగాణ రైతాంగానికి అసాధ్యం కూడా సుసాధ్యం చేసే సత్తా ఉందని నిరూపించనున్నారు.
Recommended Video
తెలంగాణ గడ్డపై కాసిన యాపిల్ రుచిని ఆస్వాదించే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలోనూ యాపిల్ పంట పండడం తెలంగాణ ప్రజలందరికీ తీపి వార్త. నిన్నమొన్నటిదాకా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యాపిల్స్ ను కొనుగోలు చేసి వాటి రుచిని ఆస్వాదించిన వారు ఇకనుండి సొంత తెలంగాణ గడ్డపై కాసిన ఫలాల రుచిని ఆస్వాదించే అపురూపమైన అవకాశం లభించనుంది. హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ ఆపిల్ తోటను సాగు చేశాడు. కేవలం చల్లటి ప్రదేశాల్లోనే పండే యాపిల్ ను తెలంగాణలోనూ పండించి చూపించాడు.
గత నాలుగేళ్ళుగా యాపిల్ సాగు చేస్తున్న రైతు
రాజమండ్రికి చెందిన ఓ నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్ రకానికి చెందిన 150 మొక్కలను ఇచ్చి వాటి సాగు విధానం చెప్పి సీసీఎంబీ శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా అవి కూడా నాటానని పేర్కొన్నారు. చాలా జాగ్రత్తగా చేసిన సాగు ఫలించింది. కాయ కాసింది .
నోరూరించే యాపిల్ పంట సిద్ధం .. ప్రయోగం సఫలం
ఇక తెలంగాణ ఆపిల్ కూడా కాశ్మీర్ యాపిల్, సిమ్లా యాపిల్ తరహాలో నోరూరించనుంది. ఇక యాపిల్ పండు దానికి కావలసిన అనుకూలమైన వాతావరణం కల్పించి చాలా జాగ్రత్తగా యాపిల్ తోటను సాగు చేశాడు. తన స్నేహితుడి సలహాతో, తనకున్న పరిజ్ఞానంతో యాపిల్ పండడానికి నాలుగేళ్లుగా కృషి చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం ప్రయోగాత్మకంగా యాపిల్ మొక్కలు నాటగా తాజాగా మొదటి పంట చేతికొచ్చింది. గుత్తులు గుత్తులుగా కాసిన యాపిల్ తోటలో కనువిందు చేస్తున్నాయి. తన నాలుగేళ్ల కష్టం యాపిల్ పండ్ల రూపంలో చేతికి రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన బాలాజీ చెట్లకు ప్రత్యేక పూజలు చేసి పండ్లను కోశారు.
తల్లికి పండ్లు అందించి ఆశీర్వాదం తీసుకున్న రైతు .. యాపిల్ తోటను పరిశీలించిన మంత్రి
ఇక తన ప్రయోగం సక్సెస్ కావడంతో మొదట కోసిన రెండు పండ్ల బుట్టలను తన తల్లికి అందించి తన సంతోషాన్ని తల్లి తో పంచుకున్నాడు . ఇక నిన్న ఆరు కిలోల యాపిల్ పండ్లను 50 చెట్లను నుంచి సేకరించారు. ఒక్కో పండు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బాలాజీ సాగు చేసిన యాపిల్ పంటను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి పరిశీలించారు. ఇక బాలాజీ తో మాట్లాడి యాపిల్ సాగుకు ఉన్న సాధకబాధకాలను తెలుసుకున్నారు. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాలాజీ తెలంగాణ యాపిల్స్ ను అందజేయనున్న నేపథ్యంలో బాలాజీ తో మాట్లాడిన మంత్రి తెలంగాణ యాపిల్ సాగు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ కు యాపిల్ పండ్లు అందించనున్న రైతు బాలాజీ
బాలాజీ సాగుచేసిన మొదటి యాపిల్ పంటను తెలంగాణ సీఎం కేసీఆర్ కు అందించేందుకు రేపు బాలాజీ ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. ఈ పండ్లను సీఎం కేసీఆర్ కు బహూకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్న రైతు బాలాజీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంటను విజయవంతంగా పండించడానికి యాపిల్ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తల ప్రోత్సాహం కూడా తనకు ఉందని రైతు బాలాజీ తెలిపారు. ఇక ఈ ప్రయోగం సక్సెస్ కావటంతో భవిష్యత్ లో మరిన్ని యాపిల్ తోటలు సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు .