అక్రమ సంబంధం: భార్యను చంపేసి లేచిపోయిందని ఫిర్యాదు
ఓ మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదృశ్యమైందని భావించిన మహిళ శవమై తేలింది. ఆమెను స్వయానా భర్త హత్య చేశాడు.
హైదరాబాద్: ఓ మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదృశ్యమైందని భావించిన మహిళ శవమై తేలింది. ఆమెను స్వయానా భర్త హత్య చేశాడు. హైదరాబాదులోని పహడీ షరీఫ్లో అదృశ్యమైందని భావించిన ఆ మహిళ యాచారం అడవుల్లో శవంగా కనిపించింది.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో భర్త ఆమెను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె ఎవరితోనో లేచిపోయిందని కుటుంబ సభ్యులను అతను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేసాడు.
తుక్కుగుడాలోని ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న అతను తమ కూతురిని చంపేశాడని హతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.
ఇలా తుక్కుగుడాకు....
ఆమనగల్లు మండలం పలుగు తాండాకు చెందిన రామావత్ శ్రీరామ్ నాయక్కు ఐదేళ్ల కింద జడ్చర్ల మండలం నేలబండ తాండాకు చెందిన లలిత (23)తో పెళ్లి జరిగింది. మూడేళ్ల క్రితం శ్రీరామ్ తుక్కుగుడాకు వలస వచ్చి ఓ కంపెనీలో ఆఫీస్ బాయ్గా చేరాడు. భార్య ఇద్దరు కుమారులు ప్రవీణ్ (3), అఖిల్ (ఏడాదిన్నర)లతో కలిసి ఉంటున్నాడు.
గత చరిత్ర....
స్వగ్రామంలో శ్రీరామ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు పట్టుకుని రూ. 40 వేలు జరిమానా వేసినట్లు చెబుతున్నారు. దాంతో అతని భార్య లలిత తన బంగారు పుస్తెల తాడు విక్రయించి ఆ మొత్తాన్ని చెల్లించిందని మృతురాలి తల్లిదండ్రులు చెప్పారు.
నిద్రమాత్రలు ఇచ్చి.....
తుక్కుగుడా యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న శ్రీరామ్ తమ కూతురిని చంపాడని, తన ప్రియురాలికి ఆస్తి ఉండడంతో ఆ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. నిరుడు బార్యతో పాటు చిన్న కుమారుడు అఖిల్కు నిద్రమాత్రలు మింగించి చంపేందుకు ప్రయత్నించాడని, అయితే నిద్రమాత్రల వల్ల అస్వస్థకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి బతికించుకున్నామని వారు చెప్పారు.
చెడు ప్రచారం....
తమ కూతురు లలితను అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆమెపై శ్రీరామ్ చెడు ప్రచారం చేస్తూ వచ్చాడని, లలితకు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపిస్తూ వచ్చాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అందులో భాగంగానే గత నెల 31వ తేదీన ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడని, పాఠశాల నిర్వాహకులు వారించినా ఇద్దరు కుమారులను బలవంతంగా పాఠశాలకు పంపించాడని అంటున్నారుట. ఆ తర్వాత లలితను తీసుకుని వెళ్లి హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు.
ఎవరితోనో లేచిపోయిందని...
హత్య చేసిన తర్వాత అదే రోజు రాత్రి కుమారులతో కలిసి పోలీసు స్టేషన్కు వెళ్లి తన భార్య ఎవరితోనో లేచిపోయిందని శ్రీరామ్ ఫిర్యాదుచేశాడని అంటున్నారు. నిందితుడు శ్రీరామ్ నాయక్ను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. హత్యకు సహకరించిన శ్రీరామ్ సోదరుడు మల్లేష్ అలియాస్ మణిపాల్, స్నేహితులు సతీష్, తరుణ్, మరో మహిళ పరారీలో ఉన్నారు.