అక్రమ సంబంధం: ప్రేయసి భర్తను హత్య చేసి, శవాన్ని పాతిపెట్టాడు
ప్రేయసితో అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి ఆమె భర్తను హత్య చేశాడు. ప్లాన్ ప్రకారం అతను ఈ హత్య చేశాడు.
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణఁతో ఓ వ్యక్తి మరొకరి సహాయంతో ప్రేయసి భర్తను దారుణంగా హత్య చేసి అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడు. ఈ ఘటన ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పిట్టల రవీందర్(27), పద్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
బతకడానికి హైదరాబాదు నగరానికి వచ్చి బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నారు. రవీందర్ చోరీలు చేస్తుంటాడు. మధ్యలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తెనాలి ప్రాంతానికి చెందిన యశోవర్ధన్ కూడా బహదూర్పల్లి ప్రాంతంలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు రవీందర్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పద్మతో అతడికి లైంగిక సంబంధం ఏర్పడింది.
ఓ చోరీ కేసులో రవీందర్ జైలుకెళ్లొచ్చిన తర్వాత స్థానికుల ద్వారా భార్యతో యశోవర్ధన్కు ఉన్న వివాహేతర సంబంధం తెలుసుకున్నాడు. అతడిని మట్టుబెట్టాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యశోవర్ధన్ స్నేహితుడు నాగరాజుతో కలిసి రవీందర్ను తీసుకుని బౌరంపేట సమీపంలోగల అటవీ ప్రాంతంలోకి 2015 సెప్టెంబర్లో వెళ్లారు. ముగ్గురూ కలిసి అక్కడ మద్యం తాగారు.
పథకం ప్రకారం రవీందర్ను హత్య చేసి శవాన్ని పాతిపెట్టారు. ఇంటికి వెళ్లిన తర్వాత పద్మ భర్త విషయం యశోవర్ధన్ను అడిగింది. అయితే మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తానని.. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. భర్త చనిపోయిన విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు.
చోరీ కేసు విషయమై పిట్టల రవీందర్ కోసం బేగంపేట పోలీసులు గాలించడం ప్రారంభించారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో భార్య పద్మ ఫోన్పై నిఘా పెట్టారు. యశోవర్ధన్ ఫోన్ నెంబర్ నుంచి పద్మకు నిత్యం ఫోన్ రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతను నేరాన్ని అంగీకరిచాడు. పద్మ విషయం తెలుసుకుని దుండిగల్ పోలీసులకు ఈనెల 13వ తేదీన ఫిర్యాదు చేసింది.
శవాన్ని పాతిపెట్టినచోట తవ్వకం జరిపి చూశారు. తీరా ఎముకలు మాత్రమే లభించాయి. సమాచారం అందుకున్న మృతుడి తల్లి, అక్క, బంధువులు ఆ ప్రాంతానికెళ్లారు.